Uniform Civil Code: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Uniform Civil Code: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఉమ్మడి పౌరస్మృతి దిశగా విపక్షాల ఆందోళనల నడుమ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే శాసనసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు.
ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఆమోదం పొందితే స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఈ బిల్లును అమలు చేయనున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలువనుంది. గోవాలో పోర్చుగీసు పాలన నుంచి ఉమ్మడి పౌరస్మృతి ఉంది. 2022లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో యూసీసీని ప్రముఖంగా పేర్కొంది.
అధికారంలోకి రాగానే సీఎం పుష్కర్సింగ్ ధామి ఉమ్మడి పౌరస్మృతిపై కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు సుదీర్ఘ కసరత్తులు చేసింది. 70కి పైగా సమావేశాలు నిర్వహించింది. 60వేల మందితో మాట్లాడింది. ఆన్లైన్లో వచ్చిన 2.33లక్షల సలహాలు, సూచనలను ఈ కమిటి పరిశీలించింది. అనంతరం ముసాయిదాను రూపొందించి ఇటీవల సీఎంకు సమర్పించింది. ఇది అమల్లోకి వస్తే.. రాష్ట్రంలో మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహ, విడాకుల, ఆస్తి, భూమి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి.