England Cricket Team : భారత్ లో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండు జట్టు అబుదాబీ బయలుదేరింది. రెండో టెస్ట్ ఒక రోజు ముందే ముగిసింది. రాజ్ కోట్ లో జరగనున్న మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మధ్యలో వీరికి 10 రోజుల ఖాళీ సమయం దొరికింది. మండే ఎండల మధ్య భారత్ లో ఉండేకన్నా దగ్గరలోని అబుదాబీకి వెళితే మంచిదని అటు బయలుదేరనుంది.
ఎందుకంటే ఇండియాకి వచ్చే ముందు ఇంగ్లాండ్ జట్టు అబుదాబి క్యాంపులో కసరత్తులు చేసింది. శిక్షణ తీసుకుంది. అందుకే మళ్లీ అక్కడికి వెళ్లి ప్రాక్టీసు చేయాలనే భావనతో టీమ్ మేనేజ్మెంట్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. నిజానికి అక్కడ ప్రాక్టీస్ చేసి, ఎకాఎకీ వచ్చి హైదరాబాద్ టెస్ట్ లో ఆడి విజయం సాధించింది. అందుకనే మళ్లీ 10 రోజులు గట్టిగా ప్రాక్టీస్ చేసి, తిరిగి రాజ్ కోట్ రావాలని భావిస్తోంది.
ఇంగ్లాండ్ దేశంలోనే క్రికెట్ పుట్టింది. నిజానికి జంటిల్మెన్ గేమ్ అని కూడా పిలుస్తారు. కానీ ఆ పదానికి నేడు అర్థం లేకుండా పోయింది. అయితే ఇంగ్లాండ్ జట్టులో ఆ భావజాలం ఇప్పటికి కూడా ఉండటం విశేషం. ఫస్ట్ టెస్ట్ లో టీమ్ ఇండియా నుంచి మంచి ప్రదర్శన వచ్చినప్పుడల్లా వారు నిజాయితీగా అభినందించడం విశేషం.
రెండో టెస్ట్ లో డబుల్ సెంచరీ సాధించిన యశస్వి జైశ్వాల్ ను ఇంగ్లాండ్ ప్లేయర్లు భుజం తట్టి ప్రోత్సహించారు. అలాగే వికెట్లు తీసిన బుమ్రాని అభినందించారు. ఇంకా సెంచరీ చేసిన శుభ్ మన్ గిల్ ను మెచ్చుకున్నారు. టీమ్ ఇండియా వైపు నుంచి కూడా అదే కనిపించింది. ఫస్ట్ టెస్ట్ లో 196 పరుగులు చేసిన పోప్ ని మనవాళ్లందరూ అభినందించారు.
ఈరోజున ఇంగ్లాండ్ టీమ్ 10 రోజుల విరామం దొరికేసరికి, అలా అబుదాబీ వెళ్లడం మంచి పరిణామమని అంటున్నారు. నిత్యం ఆటలో బందీలయ్యేకన్నా, ఆట విడుపు ఉండాలని అంటున్నారు. ఇలా ఆటగాళ్లని స్వేచ్ఛగా వదిలితే, మంచి ఫలితాలు వస్తాయని క్రీడా విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు.