Mumbai Indians coach Mark : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల కాలంలో వివాదాలకు దగ్గరగా ఉంటున్నాడు. రిటైర్మెంట్ కు దగ్గర పడుతున్న సమయంలో ఇవి కరెక్ట్ కాదని సీనియర్ సహచరులు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు ఇవ్వడంపై ఇన్నాళ్ల సస్పెన్స్ కు తెరపడింది. ఈ విషయంపై ముంబై కోచ్ మార్క్ బోచర్ స్పందించాడు.
ఓ క్రీడాఛానల్ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ఇది పూర్తిగా ఆటపరంగా తీసుకున్న నిర్ణయం మాత్రమేనని అన్నాడు. ఇది రోహిత్ కు మంచి చేస్తుందని తెలిపాడు. తనపై ఒత్తిడి తగ్గుతుందని, కొన్నాళ్లు తన ఆట తనని ఆడుకోనివ్వమని అన్నాడు. చాలామందికి విషయం అర్థం కాలేదు. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఓటమి అనంతరం జరిగింది కాబట్టి, జనంలో ఉద్వేగాలు తీవ్ర స్థాయిలో కనిపించాయని అన్నాడు.
ఈ విషయంలో రోహిత్ శర్మ భార్య రితిక స్పందించింది. ఆ వీడియోలో కోచ్ చెప్పినదంతా తప్పు అని తేల్చి చెప్పింది. ఒకే ఒక్క మాట చెప్పి కట్ చేసింది. అయితే ముందుగా రోహిత్ శర్మకు చెప్పకుండా మార్పు చేశారనే భావన వారిద్దరిలో ఉందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
అయితే ఇది భావోద్వేగాలకు గురి కావల్సిన విషయం కాదని, ఆటకు సంబంధించిన విషయాల్లో భావోద్వేగాలు అసలు పనికి రావని అన్నాడు. ప్రతీ ఆటగాడికి ఇటువంటి దశ అనేది ఒకటి వస్తుందని, దానిని అంగీకరించక తప్పదని అన్నాడు. అయితే మేం ప్రకటించిన చెప్పిన సమయం కరెక్టు కాదని అనిపించిందని అన్నాడు. ఒక ఆటగాడిగా రోహిత్ నుంచి మరింత మంచి ప్రదర్శన చూసేందుకు అవకాశం ఉంటుందని అన్నాడు. ఇప్పటికైనా తన ఆటను తనను ఆడుకోనివ్వాలని కోరాడు. అప్పుడే తను మరింత స్వేచ్ఛతో ఆడి పరుగులు సాధిస్తాడని తెలిపాడు.
ఈ విషయంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం కొన్నాళ్లు ఆగి చెప్పి ఉండాల్సింది. లేదంటే తనని టీ 20 కెప్టెన్ గా నియమించిన తర్వాత చెబితే, ఇంకా గౌరవంగా ఉండేదని అంటున్నారు. అప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు లోకి యువరక్తాన్ని ఎక్కించేందుకు చేస్తున్న ప్రయత్నంగా భావించేవారని అంటున్నారు. మొత్తానికి ఇప్పటికైనా చెప్పారు…అదే సంతోషమని కొందరంటున్నారు.