Madhya Pradesh Blast (current news from India):
మధ్యప్రదేశ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హర్దా పట్టణంలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. సుమారు 60 మందికి పైగా తీవ్ర క్షతగాత్రులయ్యారు. ఘటన జరిగిన వెంటనే ప్రాణలను కాపాడుకునేందుకు స్థానికులు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు.
ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.ఇదే విషయమై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో పక్కనే ఉన్న ఇళ్లలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఇవాళ సాయంత్రానికి మృతుల సంఖ్య 9కి చేరింది. 63 మందికిపైగా గాయాలయ్యాయి.