Cholera in Zambia (today news telugu):
కలరా వ్యాధి.. దీనినే అతిసారా అనికూడా అంటారు. కలరా వ్యాధి పేరు వినగానే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. 19వ శతాబ్దంలో భారత్ లో గంగా డెల్టాలోని జలాశయం నుంచి.. ప్రపంచవ్యాప్తంగా కలరా వ్యాధి వ్యాప్తి చెందగా.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 1971లో ఆఫ్రికా, 1991లో అమెరికా దేశాలకు సైతం కలరా వ్యాపించింది. కలరా వచ్చిన వారికి.. నీటి విరేచనాలు, వాంతులు, కాలు తిమ్మిరి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తాజాగా ఆఫ్రికా దేశమైన జాంబియాను కలరా కలవరపెడుతోంది. ఆ దేశంలో వేలాదిమంది అతిసార బారిన పడగా.. ఇప్పటి వరకూ వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కలరా విజృంభణతో జాంబియా మునుపెన్నడూ చూడని.. వైద్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడి మీడియా కథనాల ప్రకారం.. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ 600 మంది ప్రజలు కలరా బారినపడి మరణించారు. మరో 15 వేల మంది ఈ బ్యాక్టీరియా సోకి.. ఆస్పత్రి పాలయ్యారు. మొత్తం 10 ప్రావిన్సుల్లో.. తొమ్మిదింటిలో కలరా వ్యాధి ప్రబలింది.
కలరా వ్యాప్తి పెరుగుతుండటంతో.. ప్రభుత్వం స్టేడియాల వద్ద తాత్కాలిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసి.. మాస్ వ్యాక్సినేషన్ ను ప్రారంభించింది. ప్రభావిత ప్రాంతాలకు శుద్ధిచేసిన నీటిని అందిస్తోంది. అక్కడి పరిస్థితులు దిగజారడంతో.. రిటైర్డ్ డాక్టర్ల సేవలను కూడా వినియోగించుకుంటోంది ప్రభుత్వం. ఇలాంటి కష్ట సమయంలో భారీ వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి. వైద్యసేవలు, సురక్షిత నీటి సరఫరాకు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. సాధారణంగా కలరా సోకిన వారిలో మరణాల రేటు 1 శాతమే ఉండగా.. జాంబియాలో మాత్రం 4 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఈ విషయం అక్కడి ప్రజలతో పాటు.. ప్రభుత్వాన్నీ కలవరానికి గురిచేస్తోంది.
కలరాతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోన్న జాంబియాకు భారత్ ఆపన్నహస్తాన్ని అందించింది. క్లోరిన్ మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ ప్యూరిఫైడ్ చేసే మెషీన్లను ఆ దేశానికి పంపించింది.