Kadiri Lakshmi Narasimha Swamy Temple : రాయలసీమ అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది కరువు. కానీ.. ఈ సీమ గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాలకూ నెలవని బహుకొద్ది మందికే తెలుసు. తెలుగునేల మీద రాయలసీమలో ఉన్నన్ని పుణ్యక్షేత్రాలు మరెక్కడా లేవంటే అతిశయోక్తి కాదేమో. శ్రీశైలం, తిరుపతి, మహానంది, అహోబిలం, మంత్రాలయం, ఒంటిమిట్ట, శ్రీకాళహస్తి.. ఇలా ఎన్నెన్నో క్షేత్రాలు అక్కడ ఉన్నాయి. ఈ జాబితాలో ప్రత్యేకంగా చెప్పుకొని తీరాల్సిన మరో అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రమే.. కదిరి.
మన తెలుగు నేలమీద గల నవ(9) నారసింహ క్షేత్రాలుండగా.. అందులో ఒకటిగా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం విరాజిల్లుతోంది.
పురాణాల ప్రకారం.. విష్ణుద్వేషి అయిన రాక్షసరాజు హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడిని కాపాడేందుకు నారసింహుడు స్తంభం నుంచి మహోగ్ర రూపంలో ఆవిర్భవించి, తన గోళ్లతో ఆ రాక్షసుడిని సంహరించాడు. ఆ సమయంలో ఉగ్రరూపాన సంచరిస్తున్న స్వామిని చూసి ముల్లోకాలు వణికిపోగా, దేవతలంతా దిగివచ్చి శాంతించమంటూ ఆయనను అనేక స్తోత్రాలతో ప్రార్థిస్తారు.
అనేక స్తోత్రాల తర్వాత స్వామి శాంతరూపాన్ని పొందినందున ఈ కొండను ‘స్తోత్రాద్రి’ అని పిలిచేవారు. స్వామి ఇక్కడ చండ్ర (ఖాద్రిచెట్టు) వృక్షపు కొయ్య స్థంభం నుంచి వెలిసిన కారణంగా ఈ ఊరి పేరు ఖాద్రి, ఖదిరి, కదిరిగా మారుతూ వచ్చిందని మారిందని చెబుతారు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడేందుకు స్వామి స్తంభం(కంబం) నుంచి ఆవిర్భవించాడు గనుక స్వామిని కంబాల రాయుడు, కాటమరాయుడు, బేట్రాయుడు అనే పేర్లతోనూ పిలుస్తారు.
అన్నమాచార్యులు తన సంకీర్తనల్లో ఈ స్వామిని ‘కాటమరాయుడా’ అని కీర్తించారు. వైఖానస ఆగమం ప్రకారం ఇక్కడి ఆలయంలో పూజలు జరుగుతుంటాయి.
ఇక.. ఆలయ విశేషాలను పరిశీలిస్తే.. నేటి ఆలయం క్రీ.శ.1323కి ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభం కాగా, క్రీ.శ 1353 నాటికి మొదటి దశను కంపరాయలు పూర్తి చేశారు. రెండవ దశ నిర్మాణాలను హరిహర రాయలు 1386 నుండి 1418 మధ్య కాలంలో పూర్తి చేశారు. అదేవిధంగా 3వ దశ నిర్మాణాలను శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1529 మధ్య కాలంలో పూర్తి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
ఎత్తైన గాలిగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ముందుగా క్షేత్ర పాలకుడైన చెన్నకేశవస్వామిని దర్శించుకుని, అనంతరం గర్భాలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. రెండు చేతులతో హిరణ్య కశపుని శిరస్సు పాదాలను పట్టుకొని, రెండు చేతులతో ఆ రాక్షసుడి పొట్టను చీల్చుతూ స్వామి కనిపిస్తాడు. మరో నాలుగు చేతుల్లో ఖడ్గం, ఖేటకం, శంఖు, చక్రాలను ధరించిన స్వామి మూర్తికి ఎడమవైపు శాంతించమంటూ ఎడమవైపు ప్రహ్లాదుడు కొలువై ఉంటాడు. ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజున అభిషేకం చేసేవేళ స్వామికి చెమటలు పడతాయట. స్వామివారు స్వయంభువు అనటానికి ఇదే నిదర్శనమని అర్చకులు చెబుతుంటారు.