Animal OTT: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన మూవీ ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ నటుడు రణ్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్.. ‘యానిమల్’ మూవీతో మరింత ఫ్యాన్స్ ఫాలోయింగ్ను పెంచుకున్నాడు. ఈ ‘యానిమల్’ మూవీ గతేడాది విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
తండ్రీ కొడుకుల సెంటిమెంట్తో ఫుల్ యాక్షన్ కమ్ లవ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకాభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. బాబీ డియోల్, అనిల్ కపూర్ ఇందులో కీలక పాత్రలో నటించి మెప్పించారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణన్ కుమార్, మురద్ ఖేతని ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 1న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాం, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది.
ముఖ్యంగా ఈ సినిమా కంటెంట్, మ్యూజిక్ పరంగా మంచి హిట్ అయింది. ఇన్నాళ్లు చాక్లెట్ బాయ్ అంటూ సాఫ్ట్ లుక్లో కనిపించిన రణ్బీర్.. ఈ సినిమాలో మాస్ అండ్ రగ్గడ్ లుక్ అవతారంలో అదరగొట్టేశాడు. ఓ వైపు ఈ సినిమాలో వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ విమర్శలు వచ్చినప్పటికీ.. సినిమాపై ఆదరణ మాత్రం ఎక్కడా తగ్గలేదు.
జవాన్, పఠాన్, గదర్2 సినిమాల తర్వాత యానిమల్ మూవీ సెన్సేషనల్ హిట్గా నిలిచింది. థియేటర్లలో దాదాపు రూ.900 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్లో జనవరి 26న స్ట్రీమింగ్కు వచ్చిన ఈ మూవీ అక్కడ మరో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ మన దేశంలో ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన సినిమాగా సంచలన రికార్డు నమోదు చేసింది.
అంతేకాదు.. నాన్ ఇంగ్లీష్ మూవీస్ విభాగంలో నెట్ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్లలతో ఈ సినిమా 3వ ప్లేస్లో నిలిచి భారతీయ ఓటీటీ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఘనతపై అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.