Sharechat CEO Ankush Sachdeva : అంకుష్ సచ్దేవా అంటే చాలామందికి తెలియదు గానీ.. ‘షేర్చాట్’ మాత్రం అందరికి తెలుసు. ఈ షేర్చాట్ ఓనరే అంకుష్ సచ్దేవా. 23 ఏళ్ల వయసు నిండేసరికే 17 స్టార్టప్లు పెట్టి ఫెయిలైనా.. ఆ అనుభవంతో 18వ సారి షేర్చాట్ను ప్రారంభించి విజయాన్ని అందుకోవటమే గాక రూ. 40,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఇంతకీ ఇదెలా సాధ్యమైందో తెలుసుకుందాం.
చదువు, ఉద్యోగం
1992 ఘజియాబాద్లో పుట్టిన అంకుష్ సచ్దేవా.. ఇంటర్ సోమర్విల్లే స్కూల్లో చదివాడు.
2011లో ఐఐటి కాన్పూర్లో కంప్యూటర్ సైన్స్లో బీటెక్, 2015లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ ఆఫీసులో 3 నెలల ఇంటర్న్షిప్.
కొత్తదారిలో..
2015లో తన స్నేహితులైన భాను ప్రతాప్ సింగ్, ఫరీద్ ఎహ్సాన్లతో కలసి మొహల్లా ప్రైవేట్ లిమిటెడ్ తరపున చిన్నచిన్న స్టార్టప్లు ఆరంభించారు. ఢిల్లీ పోలీసు విభాగం కోసం నేరగాళ్లను గుర్తించే సాఫ్ట్వేర్తో సహా 17 ఉత్పత్తులను వీరు రూపొందించినా అవవే సక్సెస్ కాలేదు. 2015లో 18వ ప్రయత్నంగా ఈ బృందం షేర్చాట్ను ప్రారంభించింది.
దశలవారీగా 2022 నాటికి ఇందులో 740 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. ప్రధాన కార్యాలయం, బయట కలిపి 2700 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అంకుష్ సచ్దేవా సీఈఓగా ఉన్నారు. ప్రస్తుతం షేర్చాట్ తెలుగు, హిందీ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళ, బెంగాలీ, ఒడియా, కన్నడ, అస్సామీ, హర్యాన్వి, రాజస్థానీ, భోజ్పురి, ఇంగ్లీష్ భాషల్లో సేవలందిస్తోంది.
అమెరికా, యూరప్లో షేర్చాట్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 350 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్స్తో, దాదాపు 5 బిలియన్ డాలర్ల కంపెనీ(రూ. 40వేల కోట్లు)గా షేర్చాట్ ఎదిగింది. 2018లోనే ఫోర్బ్స్ ఆసియా వారి 30 ఏళ్లలోపు సంపన్నుల జాబితాలో అంకుష్ స్థానం దక్కించుకున్నాడు.