WTC Points Table Updates (sports news today) :
రెండో టెస్ట్ మ్యాచ్ విజయంతో టీమ్ ఇండియా మళ్లీ తన పాయింట్లను మెరుగుపరుచుకుని రెండో స్థానానికి ఎగబాకింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానం ఉన్న టీమ్ ఇండియా మళ్లీ పైకి వచ్చింది. నిజానికి హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ ఓడినప్పుడు రెండో స్థానంలో ఉన్న టీమ్ ఇండియా ఒక్కసారి కిందకు జారి ఐదో స్థానానికి చేరుకుంది. కానీ ఇప్పుడు మెరుగైన రన్ రేట్ తో విజయం సాధించడం వల్ల డబ్ల్యూటీసీలో 52.77 పాయింట్ల శాతంతో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ను దాటేయడం విశేషం.
ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా విన్నింగ్ పర్సంటేజ్ 55 శాతంతో అగ్రస్థానంలో ఉంది. మొన్నటి వరకు అగ్రస్థానంలో ఉన్న టీమ్ఇండియా సౌతాఫ్రికా పర్యటన తర్వాత రెండో స్థానానికి చేరుకుంది. తర్వాత ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ ఓటమి పాలై ఐదో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు మళ్లీ పైకి లేచింది. కాకపోతే నెంబర్ వన్ స్థానంలో ఉండే టీమ్ ఇండియా మళ్లీ ఆ స్థానానికి చేరుకోవాలంటే, ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్ లను భారీ తేడాతో గెలవగలిగితే, మళ్లీ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడింది. అందులో 6 మ్యాచ్ ల్లో గెలిచి, 3 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. మరొకటి డ్రాగా ముగిసింది. విన్నింగ్ పర్సంటేజ్ ని లెక్కేస్తే 66 పాయింట్లతో, 55 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న టీమిండియా 6 మ్యాచ్ల్లో 3 గెలిచి, 2 ఓడిపోయింది. ఒకటి డ్రాగా ముగిసింది. ఇలా మొత్తం 38 పాయింట్లు, 52.77 విజయం శాతంతో రెండో స్థానంలో ఉంది.
ప్రస్తుతం టీమ్ ఇండియాతో తలపడుతున్న ఇంగ్లాండ్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పటికి 7 మ్యాచ్ లు ఆడింది. అందులో 3 గెలిచి, 3 ఓడింది. ఒకటి డ్రా అయ్యింది. దీంతో ఇంగ్లాండ్ టీమ్ 21 పాయింట్లతో విన్నింగ్ పర్సంటేజ్ 25శాతంతో 8వ స్థానంలో ఉంది. టెస్ట్ మ్యాచ్ లు ఆడే దేశాల్లో ఇంక ఇంగ్లాండ్ అడుగున శ్రీలంక మాత్రమే ఉంది.
ఇక మిగిలిన దేశాల పరిస్థితి ఏమిటంటే, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ అన్నీ కూడా రెండేసి మ్యాచ్లు ఆడాయి. ఒకటి గెలిచి, ఒకటి ఓడిపోయాయి. అలా 12 పాయింట్లు సాధించి, 50 శాతంతో వరుసగా 3,4,5 స్థానాల్లో నిలిచాయి. తర్వాత పాకిస్థాన్ 6, వెస్టిండీస్ 7వ స్థానాల్లో ఉండగా.. శ్రీలంక 9వ ప్లేస్లో ఉంది.