Layoffs in Tech Companies : ఐటీ సెక్టార్ లో ఉద్యోగం వస్తే.. నీ పంట పండింది పో. నిన్ను మించినోడు ఉండడు. లక్షల్లో జీతం.. లైఫ్ బిందాస్ గా ఉంటుంది.. అని అంటారు. అదే ఆన్ సైట్ అయితే.. ఇంకా హ్యాపీ. వర్క్ లో ఎంత ప్రెషర్ ఉన్నా సరే.. అక్కడ వచ్చే జీతానికి ఉద్యోగం వదలేయాలి అని అనిపించదు. కానీ.. ఇప్పుడు ఉద్యోగాల కల్పన పోయి.. లే ఆఫ్ లు పెరిగిపోతున్నాయి. కరోనా తెచ్చిన కష్టం.. కొన్ని కుటుంబాలను రోడ్డు పడేసింది. లాక్ డౌన్ నుంచే మొదలైన లే ఆఫ్స్.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చెప్పాలంటే మరింత ఎక్కువయ్యాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, ఓక్టా.. ఇలా టెక్ దిగ్గజ సంస్థలన్నీ ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
కొత్త ఏడాది మొదలై.. నెలరోజులైందో లేదో.. అప్పుడే 32 వేల మంది ఉద్యోగులకు ఆయా సంస్థలు ఉద్వాసన పలికాయి. విషయాన్ని లేఆఫ్స్ ఎఫ్ వైఐ వెల్లడించింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకూ 32 వేలమంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలిపింది. తాజాగా స్నాప్ సంస్థ 540 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇటీవలే ఓక్టా కూడా.. 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది.
కరోనా సమయంలో వచ్చిన డిమాండ్ కు తగ్గట్లుగా.. టెక్ కంపెనీలు పెద్దఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయని, ఇప్పుడు ఆర్థికంగా లాభాలు తగ్గడంతో.. ఆయా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయని లేఆఫ్స్ ఎఫ్ వైఐ వ్యవస్థాపకుడు రోజర్ లీ తెలిపాడు. కంపెనీల ఖర్చుల నియంత్రణలో భాగంగా.. అదనంగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నాయని వివరించారు. అధిక వడ్డీరేట్లు, టెక్ పరిశ్రమలో గిరాకీ కొరత ఊహించిన దానికంటే ఎక్కువకాలం ఉండటంతో.. వాటిని మరింత దిగజార్చాయన్నారు.
ముఖ్యంగా.. టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతకు ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని లీ తెలిపారు. కృత్రిమమేధ (Artificial Intelligence-AI) కు ప్రాధాన్యత పెరుగుతుండటం వల్ల కూడా.. ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నట్లు చెప్పారు. టెక్ పరిశ్రమలో ఉద్యోగాల నియామకాల వివరాలను వెల్లడించే.. CompTIA అనే సంస్థ ఇదే విషయాన్ని తెలియజేసింది. ఏఐ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ పెరిగినట్లు పేర్కొంది. జనవరి నెలలో మరికొన్ని రంగాల్లో 33,727 నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపింది.