India Cyber Crime : దేశంలో ఎక్కడికక్కడ సైబర్ నేరాలపై కేసులు నమోదవుతుంటే.. అంతా మామూలే కదా అని ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. సైబర్ నేరాలను అరికట్టడంలో దేశానికే మార్గదర్శకంగా నిలిచిన తెలంగాణ పోలీసులు మాత్రం.. సైబర్ నేరాలపై నమోదవుతున్న కేసులను అంత తేలికగా వదలలేదు. సైబర్ నేరాలన్నింటినీ వడబోస్తే తేలిందేంటంటే.. 77 మంది దేశవ్యాప్తంగా 9 వేల సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి.. వారి ప్రొఫైల్స్ ను సిద్ధం చేసి.. నిందితుల వివరాలను అన్నిరాష్ట్రాలకు పంపుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఆ నేరగాళ్ల కోసం దేశవ్యాప్తంగా వేట మొదలైంది.
దొంగతనాలతో పోలిస్తే.. సైబర్ నేరాలు చేసే వాళ్లను పట్టుకోవడం కాస్త కష్టమే. ఎవరో తెలీదు.. ఎక్కడుంటారో తెలీదు.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరి అకౌంట్ నుంచి డబ్బు కొట్టేస్తారో అంతకన్నా తెలియదు. అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ తో.. అమాయకులే టార్గెట్ గా.. వారిని నిలువెల్లా దోచుకుంటారు. మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వాళ్లను పట్టుకున్నా.. ఆ ప్రాంతంలో చేసిన నేరాల చిట్టా మాత్రమే తెలుస్తుంది కానీ.. దేశంలో ఎన్ని నేరాలు చేశారో తెలియదు. అందుకే సైబర్ నేరాలను కట్టడి చేయడమే లక్ష్యంగా.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వినూత్న రీతిలో దర్యాప్తు చేస్తున్నారు. బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ సూచన మేరకు ఇక్కడి బాధితులకు నేరగాళ్ల నుంచి వచ్చిన ఫోన్ నంబర్లను విశ్లేషించారు.
దేశవ్యాప్తంగా నమోదయ్యే సైబర్ నేరాల వివరాలను సేకరించే.. ఇండియన్ సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ నుంచి తెలంగాణ పోలీసులు సమాచారం తెప్పించారు. రాష్ట్రంలో జరిగిన సైబర్ నేరాలు, అందుకోసం వాడిన ఫోన్ నంబర్లను ఆ సమాచారంతో.. సైబర్ క్రైమ్ ఎనాలసిస్ అండ్ ప్రొఫైలింగ్ సిస్టం ద్వారా విశ్లేషించారు. ఏదైనా నేరానికి పాల్పడిన వారి ఫోన్ నంబర్ లేదా ఐఎంఈ నంబర్ ను ఇందులో ఎంటర్ చేస్తే.. పాత నేరచరిత్ర కూడా తెలుస్తుంది. సైకాప్స్ విశ్లేషణలో ఝార్ఖండ్ కేంద్రంగా పనిచేస్తున్న 77 మంది చురుకుగా ఉన్నారని, దేశవ్యాప్తంగా వీరు 9 వేల నేరాలకు పాల్పడ్డారని తేలింది. వీరంతా కలిసి దోచుకున్న సొమ్ము.. కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితుల వివరాలను టీఎస్ పోలీసులకు ఆయా రాష్ట్రాలకు పంపగా.. గాలింపు చర్యలు మొదలయ్యాయి. 77 మందిలో కొందరిని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం దేశమంతా జల్లెడ పడుతున్నారు.