Rohit Sharma Comments on 2nd Test Winning against England: రెండో టెస్ట్ లో టీమ్ ఇండియా విజయం సాధించడంపై కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై కుర్రాళ్లతో కూడిన జట్టుతో గెలవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని అన్నాడు. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ మాత్రం బుమ్రా కారణంగానే ఓటమి పాలయ్యానని అన్నాడు.
ఈ మాటలను రోహిత్ శర్మ ఖండించాడు. నిజంగా బుమ్రా టీమ్ ఇండియా ఆయుధాల్లో ఒకడని అన్నాడు. అలాగని తను ఒక్కడి వల్లే విజయం సాధించామని అనడం కరెక్ట్ కాదని అన్నాడు. ఇది సమష్టి విజయమని తెలిపాడు. నిజానికి ఈ మ్యాచ్ లో మా బౌలర్లు విజృంభించాలని అనుకున్నాం. అనుకున్నట్టుగానే వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని తెలిపాడు.
ఇక తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించిన యశస్వి జైశ్వాల్ ను అభినందించాడు. భవిష్యత్తులో టీమ్ ఇండియాలో కీలక బ్యాటర్ గా ఎదుగుతాడని అన్నాడు. టీమ్ మేనేజ్మెంట్ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడని తెలిపాడు. జట్టులో కుర్రాళ్లు చాలామంది ఉన్నారని, వారికి అంతర్జాతీయంగా ఆడే అనుభవం రావాలని, అప్పుడే వారు క్లిష్టమైన పరిస్థితుల్లో ఆడగలరని అన్నాడు.
అందుకనే యువకులను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. ఇది భవిష్యత్ లో భారత క్రికెట్ కి మేలు చేస్తుందని అభిప్రాయ పడ్డాడు. 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై గెలవడం సాధారణమైన విషయం కాదని అన్నాడు. వాళ్లు బజ్ బల్ వ్యూహంతో వెళుతున్నారు, టెస్ట్ మ్యాచ్ లను వన్డే, టీ 20 మోడ్ లో తీసుకువెళుతున్నారని, అలాంటప్పుడు గ్రౌండ్ లో ఫీల్డింగ్ సెట్ చేయడం అనుకున్నంత ఈజీ కాదని అన్నాడు.
అందుకనే టీమ్ అంతా కలిసి అన్ని విభాగాల్లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నింటా రాణించామని అన్నాడు. అందుకే ఇది సమష్టి విజయమని మరొక్కసారి చెప్పాడు. రాబోవు మూడు టెస్టులు ఇంకా కష్టంగా ఉంటాయని అన్నాడు.
టీమ్ లో చాలామంది బ్యాటర్లు ఆరంభంలో క్రీజులో నిలదొక్కుని, వాటిని భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నారని, ఈ అంశంపై దృష్టి పెట్టాలని అన్నాడు. మొత్తానికి మ్యాచ్ విజయం సాధించి సిరీస్ ను సమం చేయడంపై ఆనందం వ్యక్తం చేశాడు.