Gill will Play India Vs England 3rd Test: రెండో టెస్ట్ లో సెంచరీ హీరో, టీమ్ ఇండియా విజయానికి దారులు వేసిన శుభ్ మన్ గిల్ మూడో టెస్ట్ ఆడటం సందేహంగా మారింది. నెట్టింట ఇదే సంచనలంగా మారింది. ఇదే జరిగితే టీమ్ ఇండియాకి బిగ్ షాక్ అని చెప్పాలి. ఇప్పుడే రాక, రాక ఫామ్ లోకి వస్తే, తను ఇలా గాయపడటం మూలిగే నక్కపై తాటి పండు పడినట్టయ్యింది. ఎందుకో ఇంగ్లాండ్ పర్యటన మొదలైన దగ్గర నుంచి టీమ్ ఇండియాకి కలిసి రావడం లేదు.
కీలకమైన ఆటగాళ్లందరూ ఒకొక్కరుగా వెనుతిరుగుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ పడుతూ లేస్తూ, టీమ్ ఇండియాని నడిపిస్తున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే గిల్ చూపుడు వేలుకి గాయమైంది. ఓవైపు చేతి వేలి నొప్పితో బాధపడుతూనే కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఇప్పుడా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఫీల్డింగ్ కి దూరమయ్యాడు. దీంతో తన ప్లేస్ లో సర్ఫరాజ్ ఫీల్డింగ్ చేస్తున్నాడు.
ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా అధికారికంగా తెలిపింది. శుభ్ మన్ గిల్ నాలుగో రోజు ఫీల్డింగ్ కి దూరంగా ఉంటాడని చావు కబురు చల్లగా చెప్పింది. అయితే ఇంతవరకు మూడో టెస్ట్ ని ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. ఇప్పటికే కీలకమైన ముగ్గురు ఆటగాళ్లు దూరమయ్యారు. విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరమైతే, మహ్మద్ షమీ విషయం ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పుడు గిల్ కూడా దూరమైతే టీమ్ ఇండియాని పట్టాలెక్కించడం కష్టమని అంటున్నారు.
ఎందుకంటే నిజానికి గిల్ ఫామ్ లోకి రాకపోతే, గొడవే లేదు. వాళ్లే తప్పించేవారు. కానీ సరిగ్గా ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఖాళీ వస్తే, అందుకున్న లయ తిరిగి దెబ్బతింటుందని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు. తను ఇక్కడ నుంచి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సి ఉందని, ఆ లయని కంటిన్యూ చేయాల్సి ఉందని అంటున్నారు.
మరిప్పుడు గిల్ పరిస్థితి ఏమిటో అర్థం కాకుండా ఉంది. మ్యాచ్ అయిన తర్వాత తన గాయం తీవ్రతపై అసలు విషయం బయటపడుతుందని అంటున్నారు. లేదంటే శ్రేయాస్ అయ్యర్ కి మరొక అవకాశం రావచ్చునని అంటున్నారు.