Chile Wildfire Effect on World:
పెరిగిన ఉష్ణోగ్రతలతో వారం రోజులుగా దక్షిణ అమెరికా భగభగలాడుతోంది. దక్షిణ చిలీ, అర్జెంటీనాల్లో వేడి భరించలేని స్థాయికి చేరింది. శాంటియాగో డి చిలీలో గత 112 ఏళ్లలో ఎన్నడూ చవిచూడనంతగా ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్కు చేరింది. ఎల్నినో కారణంగా పెరిగిన ఈ ఉష్ణోగ్రతల వల్ల చిలీ, అర్జెంటీనాల్లో కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. మూడు రోజులుగా చిలీని అతలాకుతలం చేస్తున్న దావానలం ఇప్పటికే 112 మందిని బలి తీసుకుంది. మరో 200 మంది ఆచూకీ తెలియడం లేదు.
చిలీలో 81 కార్చిచ్చులు:
గత నెల 25 నాటికి చిలీలో 81 ప్రాంతాల్లోని అడవులు అంటుకున్నాయి. వీటిలో 55 చోట్ల దావానలాన్ని అదుపులోకి తీసుకురాగా.. 15 కార్చిచ్చులను చల్లార్చే పనిలో ఉన్నారు. 5 కార్చిచ్చులను పూర్తిగా ఆర్పివేయగలిగారు. మరో ఆరు ప్రాంతాల్లో మంటలను నియంత్రిస్తున్నారు. ఇప్పటివరకు 2820 ఎకరాల అటవీభూమి భస్మీపటలమైంది.
ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే.. మరిన్ని ప్రాంతాల్లో దావానలం తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వేడి కారణంగా కార్చిచ్చులు వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కొలంబియాలో ఎమర్జెన్సీ ప్రకటించారు.
విలువైన కలప బుగ్గి:
కార్చిచ్చుల వల్ల ప్రపంచవ్యాప్తంగా కలప ఉత్పత్తికి గండిపడుతోంది. 2001 నుంచి 2021 వరకు 20 ఏళ్ల కాలంలో 18.5 నుంచి 24.6 మిలియన్ హెక్టార్ల వరకు కలపను ఇచ్చే అటవీ విస్తీర్ణాన్ని మానవాళి కోల్పోయింది. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి రిసెర్చర్ల ఉమ్మడి పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దావానలం వల్ల దాదాపు 393-667 మిలియన్ క్యూబిక్ మీటర్ల టింబర్ దహనమైందని అంచనా. 2021 నాటి ఎగుమతుల ధరల ప్రకారం దీని విలువ 77 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని లెక్కతేల్చారు.