Bangladeshis arrested : నలుగురు బంగ్లాదేశ్ వ్యక్తులు ఖమ్మంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా నకిలీ పత్రాలతో ఆధార్ సహా వివిధ ధ్రువపత్రాలు పొందారు. వీరిలో ఇద్దరికి ఇండియా పాస్పోర్టులు కూడా ఉండటం విశేషం. నకిలీ పత్రాలతో భారత్ లో ఉంటున్న నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మొహమ్మద్ సాగర్ (బోడ సాగర్) (24), మొహమ్మద్ నూర్నబీ (షేక్ నూర్నబీ) (32), మహమ్మద్ అమినూర్ మండల్ (26) షేక్ జమీర్ (మహమ్మద్ జమీర్) (30)గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలను ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్దత్ వెల్లడించారు. శాగురి ఖాతూన్ (శిల్ప) చాలా ఏళ్ల కిందట బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ముంబయికి వచ్చి పని చేసుకునేది. అక్కడ ఖమ్మం నివాసి అయిన బోడ రాములుతో పరిచయం ఏర్పడింది. తర్వాత బోడ రాములతో సహజీవనం చేసింది. వీరికి ఒక బాబు పుట్టాడు.
అనంతరం శిల్ప బంగ్లాదేశ్ వెళ్లి తన సోదరులైన నూర్నబీ, మొహమ్మద్ సాగర్లను ముంబైకి తీసుకువచ్చింది. అనంతరం వీరంతా ఖమ్మంకి చేరుకున్నారు. బోడ రాములు తండ్రిగా, శిల్పను తల్లిగా పేర్కొంటూ సాగర్ కు ఆధార్ సంపాదించుకుని.. ఖమ్మం శ్రీనివాసనగర్లో నివాసం ఉంటన్నారు. వీరంతా సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తర్వాత వీరి బంధువైన షేక్ జమీర్ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చేశాడు. నాలుగో నిందితుడైన మండల్ సైతం 11 ఏళ్ల కిందటే బంగ్లాదేశ్ నుంచి బెంగళూరు వచ్చాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. స్నేహితుడి ద్వారా ఖమ్మంలో శ్రీనివాసనగర్కు చేరి సెంట్రింగ్ పని చేసేవాడు. అయితే ఈ నలుగురు ఇక్కడి మహిళలను వివాహాలు చేసుకున్నారు. నకిలీ నివాస పత్రాలతో ఆ నలుగురు వ్యక్తులు ఆధార్కార్డులు, ఓటరు కార్డులు పొందారు.
ఖమ్మంలోనే సెంట్రింగ్ పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. ఆపరేషన్ స్మైల్ లో భాగంగా పోలీసులు నగర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే సెంట్రింగ్ పనులు కోసం పశ్చిమబెంగాల్ నుంచి బాలకార్మికులను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే బాలకార్మికుల విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో అక్రమ చొరబాట్లు విషయం వెలుగులోకి వచ్చాయి.