ayalaseema TDP MP Candidates : రాయలసీమలో ఎంపీ అభ్యర్ధులను టీడీపీ దాదాపు ఖరారు చేసిందంట..
Rayalaseema TDP MP Candidates(AP Updates): రాయలసీమలో ఎంపీ అభ్యర్ధులను టీడీపీ దాదాపు ఖరారు చేసిందంట.. అయితే పొత్తుపై బీజేపీ నిర్ణయం కోసం ఎదురుచుస్తున్న పార్టీ పెద్దలు.. అభ్యర్ధుల ప్రకటన వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, ఆర్థిక స్థితిగతులు, ప్రజలతో సత్సంబంధాలు.. ఇలా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న టీడీపీ.. సైలెంట్గా సర్వేలు కూడా చేయించుకుని.. కేండెట్లను ఖరారు చేసిందంటున్నారు. యువత, సీనియర్ల కాంబినేషన్తొగెలుపు గుర్రాలను సెలక్ట్ చేసిందని.. అతి త్వరలో కేండెట్ల లిస్ట్ రిలీజ్ అవుతుందని టీడీపీ నేతలంటున్నారు.
రాయలసీమలో గత ఏన్నికల్లో కనీసం ఓక్క ఎంపి సీటు కూడా గెలుచుకోలేకపోయిన తెలుగుదేశం పార్టీ.. ఈసారి మెజార్టీ స్థానాలలో విజయం సాధించడానికి బలమైన అభ్యర్థులను రంగంలో దించడానికి కసరత్తు పూర్తి చేసిందంట. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు పెద్ద పీట వేస్తూ.. ఆ వర్గాల్లో పేరున్న, అన్ని విధాలా సమర్ధులైన కేండెట్లతో లిస్ట్ రెడీ చేసిందంటున్నారు. గత ఎన్నికల్లో చిత్తూరు , హిందూపురం లోక్సభ సెగ్మెంట్లలో సైతం ఓటమి పాలు కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్న టీడీపీ పెద్దలు.. ఆరు నెలల క్రితమే గెలుపుగుర్రాల వేట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
టీడీపీకి గట్టి పట్టున్న అనంతపురం జిల్లాలో పాత కాపులను రంగంలోకి దించడానికి సిద్దం అయిందంట.. హిందుపురం నుంచి మాజీ ఎంపి పార్థసారథి, అనంతపురం నుంచి మాజీ ఎంపీ, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల పేర్లతో సర్వే నిర్వహించినట్లు సమాచారం.. అయితే పార్థసారథి పెనుకొండ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే.. ముందు నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న తన సీనియార్టీని గుర్తించి.. సత్యసాయి జిల్లా నుంచి మంత్రి పదవి దక్కుతుందని ఆయన భావిస్తున్నారంట.. అందుకే ఆయన పెనుగొండ టికెట్ తనకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరుతున్నారంట.
మరో వైపు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు గత ఎన్నికల్లో రాయదుర్గం నుంచి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాయని.. తనకు మరో సారి రాయదుర్గం నుంచి అవకాశం ఇవ్వాలని అంటున్నారంట.. ఒక వేళ ఆ ఇద్దరు సీనియర్ల అభ్యర్ధనలను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటే.. హిందుపురం నుంచి కురబ కార్పోరేషన్ మాజీ చైర్మన్ సబిత.. అనంతపురం నుంచి ప్రొఫెసర్ రాజేష్లను ఎంపీ అభ్యర్ధులుగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. కురబ, బోయ సామాజిక వర్గాలకు చెందిన ఆ బీసీ నేతలు కూడా పోటీకి ఆసక్తిగా ఉండటంతో వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయంటున్నారు.
కడప జిల్లా రాజంపేట లోక్సభ స్థానానికి మాజీ ఎంపి పాలకొండరాయుడు కూమారుడు సుగవాసి సుబ్రమణ్యం పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. బలిజ సామాజక వర్గానికి చెందిన సుబ్రమణ్యం ప్రభావం.. రాజంపేట ఎంపీ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇక కడప నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బరిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీతో పొత్తులేకపోతే.. ఆదినారాయణరెడ్డి తిరిగి టీడీపీలోకి పోటీ చేస్తారంటున్నారు.
ఇక కర్నూలు ఎంపీ అభ్యర్ధిగా డాక్టర్ పార్థసారథి పేరు ఖరారైందంట. అలాగే నంద్యాల ఎంపీ కేండెట్గా బిజ్జం పార్థసారధిరెడ్డి ఫోకస్ అవుతున్నారు. అయితే పొత్తుల లెక్కలతో నంద్యాల లోక్సభ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాల్సి వస్తే ఆ పార్టీ నుంచి నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలు బైరెడ్డి శబరి రేసులో కనిపిస్తున్నారు.
చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి జిల్లా వాసి అయిన ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి ప్రసాద్తో పాటు మాజీ ఐపీఎస్ అధికారి పేర్లతో లిస్ట్ రెడీ అయిందంటున్నారు. అయితే వారితో పాటు ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తిరుపతి పార్లమెంట్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కుమార్తె, రాజ్యసభ మాజీ సభ్యుడు తలారి మనోహర్ రెండో కోడలైన తలారి నిహారికను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు అక్కడ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎంపీ పనబాక లక్ష్మి కుటుంబానికి సూళ్లూరుపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
మొత్తమ్మీద అభ్యర్ధుల కసరత్తుని టీడీపీ దాదాపు పూర్తి చేసిందని.. బీజేపీతో పొత్తుపై లెక్కలు తేలగానే .. జాబితా విడుదల చేస్తుందంటున్నారు. ఆ క్రమంలో పొత్తుపై తేల్చకుండా.. నాన్చుడు ధోరణి అవలంభిస్తున్న బీజేపీపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.