Anna Venkata Rambabu: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని.. వ్యక్తిగత కారణలతో దూరంగా ఉంటున్నానని ప్రకటించారు ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు.
Anna Venkata Rambabu news(Political news in AP): వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని.. వ్యక్తిగత కారణలతో దూరంగా ఉంటున్నానని ప్రకటించారు ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. దాంతో ఆయన తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని జగన్ సూచించినట్లు ప్రచారం జరిగింది. అప్పటికీ పోటీ చేసే విషయమై రాంబాబు ఏం మాట్లాడలేదు. అయితే సడన్గా ఎన్నికల్లో పోటీకి రెడీ అయిపోయారు. అది కూడా తన సిట్టింగ్ సీటు గిద్దలూరు కాకుండా.. మార్కాపురానికి షిఫ్ట్ అయ్యారు. అసలు అన్నా రాంబాబు విషయంలో ఏం జరిగింది?. ఆయన వ్యూహాత్మకంగా ఆడిన పొలిటికల్ గేమ్లో సక్సెస్ అయ్యారా?
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు.. ఆయన రాజకీయం ఒక పట్టాన ఎవరికీ అంతుపట్టదు.. తన పొలిటికల్ కెరీర్ కోసం రాంబాబు తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించిన ఆయన.. గిద్దలూరుని వదిలేసి మార్కాపురం రేసులో ప్రత్యక్షమయ్యారు. మార్కాపురం వైసీపీ టికెట్ దక్కడం వెనుక.. ఆయన ఆడిన పొలిటికల్ గేమ్ కరెక్ట్గా వర్కౌట్ అయిందంటున్నారు.
2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాంబాబు.. తొలి ప్రయత్నంలోనే గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. పీఆర్పీ విలీనంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన.. రాష్ట్ర విభజన తరువాత టీడీపీలోకి వచ్చి.. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2017లో టీడీపీకి రాజీనామా చేసి వైసీసీ తీర్థం పుచ్చుకుని .. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యేగా బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. పులివెందులలో జగన్కు వచ్చిన మెజర్టీ తర్వాత.. రాష్ట్రంలో రెండో అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డుల కెక్కారు.
అలాంటాయన ఎన్నికల దగ్గర పడిన తరుణంలో ఈ సారి పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి చర్చల్లో వ్యక్తి అయ్యారు. అయితే రాంబాబు పక్కా స్ట్రాటజీతోనే ఆ ప్రకటన చేశారంటున్నారు. ఇటీవల భేటీలో.. తాను రాజకియాలకు గుడ్ బై చెప్పాటానికి కారణం ఏంటో?. తాను జిల్లా పార్టీతో పాటు గిద్దలూరులో పడుతున్న ఇబ్బందులను.. జగన్కు వివరించారంట రాంబాబు.. మాజీ మంత్రి బాలినేని కారణంగా గిద్దలూరులో తనకు వ్యతిరేకంగా అసమతి వర్గం తయారైందని.. రెడ్డి సామాజికవర్గం అందుకే తనను వ్యతిరేకిస్తోందని చెప్పుకొచ్చారంట.
ప్రస్తుతం వైసీపీలో బాలినేని పరిస్థితే బాగోలేదు.. ఎంపీ మాగుంట విషయంలో ఆయన పట్టుపట్టడంపై జగన్ ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. అందుకే గత ఎన్నికల వరకు జిల్లా పార్టీ బాధ్యతలు చూసుకున్న బాలినేని ప్రతిపాదనలని.. ఇప్పుడు జగన్ పక్కన పెట్టేస్తున్నారు. మరోవైపు ఒంగోలు ఎంపీ మాగుంటపై ఎమ్మెల్యే రాంబాబు గత నెలలో విమర్శలు గుప్పించారు. అటు బాలినేనితో ఉన్న గ్యాప్పై ఫిర్యాదు.. ఇటు మాగుంటపై విమర్శలు.. అంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారంట రాంబాబు. అదే జగన్ దగ్గర ఆయనకు ప్లస్ అయిందంటున్నారు.
ఆయన గిద్దలూరును వదులుకోవాలని ముందే నిర్ణయించుకున్నారని.. అందుకే పాలి ‘ట్రిక్స్‘ ప్లే చేశారన్న టాక్ వినిపిస్తోంది.. ఇప్పటికే గిద్దలూరు వైసీపీలోని రెడ్డి వర్గం నేతలు రాంబాబు నాన్ లోకల్.. అని ప్రచారం చేస్తున్నారు . వచ్చే ఎన్నికలలో రాంబాబుకి సీట్ కేటాయిస్తే సపోర్ట్ చేయమని ప్రకటించారు. గిద్దలూరు వైసీపీ సీటుని రెడ్లకు ఇవ్వాలని బాలినేని ముందు డిమాండ్ ఉంచారు. దాంతో బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక రెడ్డి నేతల పేర్లను జగన్కు ప్రతిపాదించారంట. అయితే బాలినేని పరిస్థితే పార్టీలో బాగోలేకపోవటంతో బాలినేని ప్రతిపాదించిన పేర్లను పక్కన పెట్టేశారంట.
ఏదేమైనా గిద్దలూరులో తిరిగి పోటీ చేస్తే రెడ్డి వర్గం సహకరించే పరిస్థితి లేదన్న అనుమానంతోనే.. ఎమ్మెల్యే రాంబాబు ఈ తతంగం అంతా నడిపించారంటున్నారు. జగన్ కూడా రాంబాబుతో భేటీ తర్వాత అదే నిర్ణయానికి వచ్చి.. అన్నా రాంబాబును ఈ సారి గిద్దలూరు నుంచి షిఫ్ట్ చేసి.. మార్కాపురం సమన్వయకర్తగా నియమించారంట. మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డిని గిద్దలూరు వైసీసీ ఇన్చార్జ్గా పంపించారంట. బాలినేని, మాగుంటలతో రాంబాబుకు విభేదాలు ఉండటం.. ఆయన్ని జగన్కు దగ్గర చేశాయని.. ఆ క్రమంలోనే ఆయనకు ఆశించిన టికెట్ దక్కిందని వైసీపీ శ్రేణులే అంటుండటం విశేషం.
ఇప్పటికీ ప్రకాశం జిల్లాలో బాలినేని పెత్తనం ఉండుంటే.. ఈ సారి అన్నారాంబాబు టికెట్ దక్కదే కాదన్న టాక్ కూడా వినిపిస్తోంది.. ఏదేమైనా గిద్దలూరు వద్దనుకున్న అన్నా రాంబాబుకు మార్కపురం నియోజకవర్గంలో కొత్త తలనొప్పులు తప్పేటట్లు లేవంటున్నారు.. గిద్దలూరులో రాంబాబు వర్గీయులు నాగార్జున రెడ్డికి సహకరించినా.. మార్కపురంలో భిన్న వాతావరణం కనిపిస్తోంది.
మార్కాపురం సీటును అక్కడి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న జంకె వెంకటరెడ్డి ఆశించారు.. మరి ఇప్పుడు జంకె వర్గం నాన్ లోకల్ అయిన రాంబాబుకు ఎంత వరకు సహరిస్తుందనేది అనుమానమే అంటున్నారు.. అటు గిద్దలూరులో కూడా స్థానిక రెడ్డి నేతలు టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. వార్ని కాదని నాన్ లోకల్ అయిన నాగార్జునరెడ్డిని గిద్దలూరు ఇన్చార్జ్ని చేశారు. మరి గిద్దలూరు సీటు ఆశించిన రెడ్డి సామాజికవర్గ నేతలు.. నాన్ లోకల్ లీడర్కి ఏ మాత్రం సహకరిస్తారో చూడాలి.