Krishna water tribunal updates(Telugu breaking news): కృష్ణానదీ జలాల వివాదం వచ్చిన ప్రతిసారీ మనం బచావత్ ట్రిబ్యునల్, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనే మాటలు వింటుంటాం. ఇంతకీ ఈ ట్రిబ్యునల్స్ సంగతి ఏమిటి? ఇవెందుకు ఏర్పాటైంది? ఏ ప్రాతిపదిక కృష్ణా నదీ జలాలను ఈ ట్రిబ్యునళ్లు పంపిణీ చేశాయి? ఇందులో ఉన్న వివాదాలేంటి? వంటి కొన్ని వివరాలు తెలుసుకుందాం.
మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ల గుండా ప్రవహించే కృష్ణానదిలో ఎవరు ఎంత నీరు వాడుకోవాలనే అంశంపై 1960ల నాటికే కొన్ని వివాదాలు వచ్చాయి. ఈ నీటి పంపిణీ అంశం తరచూ ఆయా రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు, రాజకీయ పోరాటాలకు దారితీయటంతో నాటి కేంద్ర ప్రభుత్వం దీనికో శాశ్వత పరిష్కారాన్ని సూచించాలనే ఉద్దేశంతో 1969 ఏప్రిల్ 10న ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. దీనికి జస్టిస్ ఆర్.ఎస్. బచావత్ను అధ్యక్షుడిగా, షంషేర్ బహదూర్, డి.ఎం. భండారి సభ్యులుగా నియమించి కృష్ణా నదిలో లభ్యమయ్యే నీటిని మూడు రాష్ట్రాల మధ్య పంపకం చేయమని కోరింది. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 కు లోబడి ఈ ట్రిబ్యునల్ ఏర్పాటయింది.
ఈ ట్రిబ్యునల్ నాటి నదీ జలాల మీద కూలంకషంగా రీసెర్చి చేసి, 1973లో తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. దానిని భారత ప్రభుత్వం మరోసారి అధ్యయనం చేసి 1976 మేలో ప్రకటించింది. ఈ ట్రిబ్యునల్ కృష్ణానది నీటిలో 75 శాతం మొత్తాన్నే పరిగణనలోకి తీసుకుని నీటి మొత్తాన్ని 2060 టీఎంసీలుగా తేల్చింది. ఇది నికర జలాలు. అంటే.. మినిమం ఇంతనీరు ఒక ఏడాదిలో కృష్ణలో పారుతుందన్నమాట. ఈ మొత్తంలో 560 టీఎంసీలు మహారాష్ట్రకు, 700 టీఎంసీలు కర్ణాటకకు, 800 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. ఈ నీటిని నదిలో ఎక్కడి నుంచైనా, ఏ ప్రాజెక్టు ద్వారానైనా ఈ మూడు రాష్ట్రాలు వాడుకోవచ్చని చెప్పారు.
ఇక.. కృష్ణానది ద్వారా అందే మిగులు జలాలను 330 టీఎంసీలుగా లెక్కవేశారు. బాగా వానలు కురిసి, పై రాష్ట్రం వాడుకోలేక ఆ నీటిని కిందకు వదిలితే.. వాటిని మిగులు జలాలు అంటారు. ఈ నీటిలో మహారాష్ట్రకు 25 శాతం, కర్ణాటకకు 50 శాతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 25 శాతం ఇస్తారు. ఒకవేళ ఈ మిగులు జలాల పంపిణీ విషయంలో రాష్ట్రాలన్నీ కలిసి ఒక మాట మీదికి రాలేకపోతే.. అప్పుడు పార్లమెంటు జోక్యం చేసుకొని వాటిని పంచాలని ట్రిబ్యునల్ సూచించింది.
అయితే 1976 వరకూ కేంద్ర ప్రభుత్వం ఈ మిగులు జలాలమీద స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవటంతో.. తాత్కాలికంగా ఈ నీటి మీద ఆంధ్రప్రదేశ్కి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే.. ఈ మూడు రాష్ట్రాల్లో ఏపీ కింద ఉంటుంది కనుక.. ఎక్కువైన నీరు మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత దిగువనున్న ఏపీకే ప్రవహిస్తుంది కనుక అలా నిర్ణయించారు. కానీ.. ఇది ఏపీకి హక్కు కాదు అని కేంద్రం స్పష్టం చేసింది.
అయితే.. ఈ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను కొన్నేళ్లు 3 రాష్ట్రాలు బాగానే ఆచరించాయి. అయితే.. కిందనున్న ఆంధ్రప్రదేశ్ తనకు విరివిగా లభిస్తున్న మిగులు జలాలను మరింతగా ఉపయోగించుకునేందుకు నీటి పారుదల ప్రాజెక్టులను ప్రారంభించింది.
దీంతో కర్ణాటక అడ్డం తిరిగింది. సహజ నదీ సూత్రాల ప్రకారం, కృష్ణా నది, దాని ఉప నదులు కర్ణాటకలోనే ఎక్కువ దూరం ప్రవహిస్తాయని, ఈ సూత్రాన్ని విస్మరించి, బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి ఎక్కువ నీరు ఇచ్చిందనీ, ఆ ఇచ్చిన నీటినే తాము వాడుకోలేకపోతుండగా, కిందనున్న ఏపీ కొత్త ప్రాజెక్టును (రాయలసీమకు నీరిచ్చేందుకు ఎన్టీఆర్ ప్రభుత్వం తెచ్చిన తెలుగుగంగ ప్రాజెక్టు) ప్రారంభించిందని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి మహారాష్ట్ర కూడా గొంతు కలిపింది.