India vs England 2nd Test : ఎట్టకేలకు శుభ్ మన్ గిల్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. కష్టతరమైన పిచ్ మీద, తన శక్తిని, మేథస్సుని, అనుభవాన్ని ఉపయోగించి సూపర్ సెంచరీ సాధించాడు. 147 బంతుల్లో 2 సిక్సర్లు, 11 ఫోర్లతో 104 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విశాఖలో జరుగుతున్న రెండో టెస్ట్, రెండో ఇన్నింగ్స్ తనకిక మిగిలిన ఆఖరి అవకాశం అనేది అందరికీ తెలిసిన విషయం.
ఇప్పుడు కూడా ఆడకపోతే, ఇక తట్టాబుట్టా సర్దుకోవల్సిన సమయంలో సెంచరీ చేసి బతుకు జీవుడా అని బయటపడ్డాడు. ఒకరకంగా చెప్పాలంటే అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఎందుకంటే 30 పరుగులకే ఓపెనర్లు రోహిత్ శర్మ, డబుల్ సెంచరీ వీరుడు యశస్వి జైశ్వాల్ ఇద్దరూ అవుట్ అయిపోయారు. అప్పుడు క్రీజులోకి వచ్చిన గిల్ ఒక ఫోర్ కొట్టి జోరు మీద కనిపించాడు.
కానీ, ఆ 4 పరుగుల మీదే ఎల్బీడబ్ల్యూ అప్పీలు కి దొరికిపోయాడు. కాకపోతే డీఆర్ఎస్ కి వెళ్లడంతో బతికి బయటపడ్డాడు. తర్వాత మరో బాల్ కి ఎల్బీడబ్ల్యూ అంటూ ఇంగ్లాండ్ హడావుడి చేసింది. అంపైర్ నాటౌట్ అనడంతో మళ్లీ డీఆర్ఎస్ కి వెళ్లింది. బాల్ అలా ఆఫ్ స్టంప్ పై నుంచి వెళ్లడంతో మళ్లీ బతికిపోయాడు.
ఇవన్నీ చూసి, ఈ మ్యాచ్ లో కూడా గిల్ ఎంతో సేపు ఉండడు, ఫుట్ మూమెంట్ కరెక్టుగా లేదని అంతా అనుకున్నారు. కానీ అక్కడ నుంచి మరొక అవకాశం ఇవ్వకుండా గిల్ చక్కగా ఆడాడు. సెంచరీ వరకు జాగ్రత్తగా ఆడి స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు.
రెహాన్ అహ్మద్ వేసిన ఓవర్లో వరుసగా సిక్సర్, ఫోర్ కొట్టి సెంచరీకి చేరువయ్యాడు. చివరికి 132 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్ మ్యాచ్ ను కూడా వన్డే తరహాలోనే ఆడి, ఈ సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించాడు. మొత్తానికి టెస్టు ఫార్మాట్లో గిల్కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం.
ఎంతో క్లిష్టమైన దశలో శ్రేయస్ అయ్యర్ (29)తో కలిసి గిల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు మూడో వికెట్కు 81 పరుగులు జోడించి టీమిండియాను పటిష్టస్థితిలో నిలబెట్టారు. కానీ బెన్ స్టోక్స్ అద్భుతమైన క్యాచ్కు శ్రేయస్ వెనుదిరగాల్సి వచ్చింది.
తర్వాత నెమ్మదిగా ఒకొక్కరితో పార్టనర్ షిప్ లు నిర్మిస్తూ టీమ్ ఇండియా స్కోరుని గిల్ ముందుకు తీసుకువెళ్లాడు. 211 స్కోరు వద్ద 5వ వికెట్ గా వెనుతిరిగాడు. తర్వాత 42 పరుగులు చేసి టీమ్ ఇండియా 253కి ఆలౌట్ అయ్యింది.
గిల్ ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్ల్లో 207 పరుగులే చేశాడు. బ్యాటింగ్ లో 18 సగటు మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఎవరు నమ్మినా, నమ్మకపోయినా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం గిల్ పై నమ్మకం పెట్టింది. ముఖ్యంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరి పట్టుదల కారణంగా ఇన్నాళ్లూ జట్టులో అవకాశాలు అందిపుచ్చుకున్నాడనేది అందరికీ తెలిసిన సత్యం.