CM Revanth: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కృష్ణా జలాల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
CM Revanth reddy latest news(TS politics): బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కృష్ణా జలాల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం కేసీఆర్ లోక్ సభలో ఉండగానే ఆమోదం పొందిందన్నారు. ఈ చట్టానికి కేసీఆర్ ఆమోదం తెలిపారన్నారు. కేసీఆర్ రాష్ట్రానికి రావాల్సిన 500 టిఎంసీల నీటిని ఏపీకీ దారదత్తం చేశారన్నారు.
తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేసిన పాపాలకు హద్దేలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారు చేసిన పాపం వల్లే రాష్ట్రానికి జలాల్లో నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందన్నారు. కృష్ణా, గోదావరిపై నిర్మించే కొత్త ప్రాజెక్టుల నిర్వహణ కోసం విధివిధానాలు విభజన చట్టంలో ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని కేసీఆర్ చెప్పారని సీఎం గుర్తు చేశారు. ఇప్పుడేమో కాంగ్రెస్ పై అబద్దాలు ప్రచారం చేస్తున్నాని దుయ్యబట్టారు. విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు.
కృష్ణానదిలో 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలనే దానిపై కేంద్రం కమిటీ వేసిందని సీఎం రేవంత్ తెలిపారు. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇస్తున్నట్లు ఆ కమిటీ ప్రతిపాదించిందని పేర్కొన్నారు. ఆ ప్రతిపాదనకు కేసీఆర్, అధికారులు ఒప్పుకొనే సంతకాలు పెట్టారన్నారు. ఏపీకి ఎక్కువ నీరు వచ్చేలా చేశారన్నారు. కృష్ణా నదిపై ఉన్న 15 ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లు 2022లో సంతకాలు చేశారన్నారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నిర్వహణకు 2023 బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు ప్రాజెక్టులపై కేసీఆర్ పార్లమెంట్లో ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కృష్ణా నీటిలో 50 శాతం వాటా కావాలని అడుగుతున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్, హరీశ్రావు నీటి పారుదల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగిస్తుందని అబద్ధాలు ప్రచారం చేస్తుందన్నారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారన్నారు. దీనికి కేసీఆర్, హరీశ్రావులే సహకరించారన్నారు. దీని వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ తరుపున పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డిలు కొట్లాడారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు తరలింపునకు ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రోజుకు 8 టీఎంసీలు ఏపీకి తరలించడానికి కేసీఆర్ అనుమతిచ్చారన్నారు. మే 5, 2022న ఈ మేరకు జీవో ఇచ్చారన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ముచ్చుమర్రి కట్టారని తెలిపారు. 800 అడుగుల వద్ద నీటి తరలింపునకు ప్రయత్నించారన్నారు. దానికీ కేసీఆర్ సహకరించారని సీఎం పేర్కొన్నారు.
గతంలో కృష్ణానదిపై ప్రాజెక్టులపై ఆధిపత్యం తెలంగాణ చేతిలోనే ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయి తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు. పదవులు, కమీషన్లకు లొంగి కేసీఆర్ జలదోపిడీకి సహకరించారని విమర్శించారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే పది లక్షల ఎకరాలకు నీరు అందేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటి కంటే ఎక్కువ నిర్లక్ష్యం కేసీఆర్ హయాంలోనే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కేఆర్ఎంబీ మీటింగ్ మినిట్స్ తప్పుగా రాశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై జనవరి 27న మన అధికారులు కేంద్రానికి లేఖ రాశారన్నారు. తెలంగాణ నీటి హక్కుల కోసం తమ ప్రభుత్వం తరుపున కొట్లాడుతున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ జనంలోకి వచ్చేందుకు మొహం చెల్లక మాయమాటలు చెబుతున్నారన్నారు.
నాగార్జున సాగర్ డ్యామ్ను జగన్ ఆక్రమిస్తే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులపై శాసనసభ ఉమ్మడి సమావేశాలు నిర్వహిద్దమన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై రెండు రోజులు ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రాజెక్టులపై కేసీఆర్ ఎంతసేపైనా మాట్లాడొచ్చు.. తాము అడ్డురామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని అని రేవంత్రెడ్డి తెలిపారు.
ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రస్తక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదని దుస్తితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సర్వనాశనం చేశారన్నారు. దీనిపై ఆయనకు మాట్లాడే హక్కే లేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. జగన్, కేసీఆర్ ఏకాంత చర్చల్లో ఏం కుట్ర చేశారో? చెప్పాలని ప్రశ్నించారు. ఎత్తిపోతల ద్వారా జగన్ రోజుకు 8 టీఎంసీల నీటిని తీసుకెళ్తుంటే.. కేసీఆర్ కేవలం 2 టీఎంసీల కోసం రూ. లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించే ప్రయత్నం చేశారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు.