Gautam Gambhir : సోషల్ మీడియాలో ఎవరైనా బాగా ఆడితే ఆకాశానికి ఎగరేసేయడం, బాగా ఆడకపోతే పాతాళానికి తొక్కేయడం ఎక్కువైపోయిందని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సోషల్ మీడియాపై సీరియస్ అయ్యాడు.
ఇదంతా ఎందుకంటే యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రెండో టెస్ట్ లో డబుల్ సెంచరీ చేయడంతో అందరూ అతన్ని పొగడ్తలతో ముంచెత్తడం అతని కెరీర్ కి ఎంతమాత్రం మంచిది కాదని అన్నాడు. తనని భూమ్మీద కాసేపు ఉంచమని కోరాడు.
ఎప్పుడూ కూడా ప్రతీ ఆటగాడికి ఒక సహజసిద్ధమైన శైలి ఉంటుంది, ఆ ఆట అతన్ని ఆడుకోనివ్వాలని అన్నాడు. గొప్పలు ఎక్కువ చెబితే, అనవసరమైన ఒత్తిడి పెరిగి, ఆటపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు.
రెండో టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన యశస్వికి అభినందనలు అంటూనే, ఊరికినే అతన్ని ఆకాశానికి ఎత్తవద్దని సోషల్ మీడియాకి సూచించాడు. అలాగే అభిమానులు, సీనియర్లకు కూడా వర్తిస్తుందని అన్నాడు. అందరి ఫోకస్ పడితే, తన సహజత్వం దెబ్బతింటుందని అన్నాడు.
దీనివల్ల రెండు రకాల ఇబ్బందులు బ్యాటర్లపై ఉంటాయని అన్నాడు. ఒకటి అందరూ తమ నుంచి ఏదో ఆశిస్తున్నారనే భావనతో ఆడితే ఓవర్ డిఫెన్స్ కి వెళ్లే ప్రమాదం ఉందని అన్నాడు. లేదంటే ప్రతి మ్యాచ్ లో అద్భుతాలు చేయాలనే భావన వస్తే, ఏకాగ్రత దెబ్బ తింటుందని అన్నాడు.
అందువల్ల సోషల్ మీడియాలో ఊరికినే ట్యాగ్ లు ఇచ్చి ఆకాశానికి ఎత్తితే, బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీని ఫలితాన్ని టీమ్ ఇండియాలో చాలామంది అనుభవించారు, వారి కెరీర్ లు ఇబ్బందుల్లో పడ్డాయని అన్నాడు.
శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ ప్రతిభావంతులైన ఆటగాళ్లేనని అన్నాడు. అందుకే వారింకా టీమ్ ఇండియాలో కొనసాగుతున్నారని తెలిపాడు. వారికింకా అవకాశాలు ఇవ్వాలని, టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయంతో ఏకీ భవించాడు. గతంలో ఇలాగే పుంజుకున్నారని గుర్తు చేశాడు.
వారు గానీ క్రీజులో కుదురుకుంటే భారీ స్కోర్లు చేయగలరని తెలిపాడు.ఇప్పుడా ప్రతిఫలాన్ని రెండో టెస్టులో గిల్ నిరూపించాడు. అందుకనే ఎవరూ తొందరపడి మాటలు జారవద్దని, బ్యాటర్ల భవిష్యత్తుతో ఆటలాడవద్దని తెలిపాడు.