Melinda foundation (daily news update):
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్.. తాను స్థాపించిన బిల్,మిలిండా ఫౌండేషన్ కోసం పూర్తి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ను సమర్థవంతంగా నడిపించేందుకు కొత్త టీంని నియమించారు. ఇందులో భాగంగా నాటి సీఈవోగా ఉన్న స్టీవ్ బామర్ను తప్పించి సత్య నాదెళ్లకు 2014 ఫిబ్రవరి 4న ఆ బాధ్యతలు అప్పగించారు. కానీ.. అప్పటికే22 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్లో పని చేస్తున్న సత్య.. ఇప్పుడు ఇక కొత్తగా చేయటానికి ఏముంది? అంటూ కొందరు కామెంట్ చేశారు.
అయితే.. ఆ రోజు బిల్ గేట్స్ ‘మీటింగ్’ అంటూ.. సత్య నాదెళ్లతో బాటు మైక్రోసాఫ్ట్లో టాప్ 10 ఎగ్జిక్యూటివ్స్ను పిలిచాడు. రాగానే వారందరి చేతిలో Nonviolent Communication అనే ఓ పుస్తకం పెట్టాడు. మార్షల్ రోసెన్బర్గ్ రాసిన ఆ పుస్తకం అందరూ తప్పక చదవాలని చెప్పాడు. క్రిటిసిజమ్, జడ్జిమెంట్ వదిలి.. పాజిటివ్ ఆలోచనలతో ఎలా ముందుకు పోవాలని చెబుతూ రాసిన ఆ పుస్తకం మీకు దారి చూపిస్తుందని చెప్పాడు.
నాటి నుంచి ఆ పుస్తకం మైక్రోసాఫ్ట్కు గైడ్గా మారింది. సత్య నాదెళ్ల నాయకత్వంలో ‘అన్నీ మనకు తెలుసు’ అనేది పోయి ‘అన్నీ నేర్చుకో’ అనే కొత్త మార్పు దిశగా మైక్రోసాఫ్ట్ సాగిపోయింది. అంతేకాదు.. ‘మీ అభిప్రాయం ఏమిటి’ అని ఉద్యోగుల అభిప్రాయానికీ విలువివ్వటం, వారి పాజిటివ్ ఫీడ్బ్యాక్ మీద ఫోకస్ చేస్తూ, ఉద్యోగులకు మంచి వాతావరణాన్ని కల్పిస్తూ, వారిలో ఒక ఉత్సాహాన్ని నింపటంతో.. కేవలం పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్ ఊహించని ఎత్తులకు చేరింది.
నిజానికి సత్య సీఈవోగా వచ్చే నాటికి మైక్రోసాఫ్ట్ లాభాల్లో ఉన్నప్పటికీ.. స్మార్ట్ఫోన్ మార్కెట్ ఇన్వెస్టర్లలో కాస్త వెనకే ఉంది. దీనిని గమనించిన సత్య.. మొబైల్, క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కొత్తగా వస్తున్న చిన్న కంపెనీలతో కలిసి పనిచేసే విషయంలో ‘ఇగో’ను పక్కనబెట్టి ఆ టెక్ కంపెనీలతో కలిసి పనిచేద్దామనీ, దూకుడుగా నిర్ణయాలు ఇక వద్దని టీంకి స్పష్టం చేశారు.
మారుతున్న కాలానికి తగ్గట్టు కొత్త ఆవిష్కరణలతో మార్కెట్లో ముందుగానే రెడీగా లేకపోతే.. వెనకబడిపోతామని స్పష్టం చేశారు. అదే సమయంలో తన టీంలో అతి చిన్న ఉద్యోగి సీటు దగ్గరా కూర్చొని తనకు కావాలసినది రాబట్టుకుని కార్పొరేట్ రంగంలో ‘ఫ్రెండ్లీ బాస్’గా, ‘మోస్ట్ అడ్మయిర్డ్’ సీఈవోగా నిలిచారు.
ఈ క్రమంలో సత్య మైక్రోసాఫ్ట్ సీఈవో అయిన తర్వాత తీసుకున్న తొలి నిర్ణయం.. గతంలో మైక్రోసాఫ్ట్ వద్దనుకున్న తన ప్రధానపోటీదారు ఆపిల్తో కలిసి పనిచేయాలని నిర్ణయించటం. అలాగే..మైక్రోసాఫ్ట్ను దాని సాఫ్ట్వేర్, సేవలను Linux, Google, Apple వంటి ఇతర ఆపరేటింగ్ సిస్టమ్లకు తీసుకురావడం. దీనివల్ల మైక్రోసాఫ్ట్ సేవల మార్కెట్ వేగంగా పెరిగింది.
సత్య సీఈవోగా రాకముందు.. మైక్రోసాఫ్ట్ సొంతగా స్మార్ట్ ఫోన్ తయారు చేయాలనే ఉద్దేశంతో నోకియా కంపెనీని కొనుగోలుకు ఒప్పందం కూడా చేసుకుంది. ఇది ప్రాక్టికల్గా వర్కవుట్ కాదని భావించిన సత్య.. తన రెండవ నిర్ణయంగా రూ.63 వేల కోట్ల విలువైన ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. అంతేకాకుండా.. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద లభించే రాయల్టీ మీద ఆధారపడకుండా.. కొత్త రెవెన్యూ మీద ఫోకస్ చేయాలని నిర్ణయించారు.
దీనికోసం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీకి కొత్తరూపం ఇవ్వటం, యాపిల్ ఐప్యాడ్కు ఆఫీస్ సాఫ్ట్వేర్ను విడుదల చేయటం, ఐఫోన్, ఆండ్రాయిడ్ యాప్స్ తీసుకురావటం, విండోస్ 9 వదిలేసి నేరుగా విండోస్ 10 ని ఆవిష్కరించటం, అజూరే క్లౌడ్లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను వాడటం, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ బుక్ అనే ల్యాప్ట్యాప్ను తీసుకురావటం వంటి వేగవంతమైన నిర్ణయాలతో కంపెనీ రెవెన్యూ ఒకేసారి 7 రెట్లు పెరిగింది.
దానికి బదులు 2016లో 26 బిలియన్ డాలర్లతో లింక్డ్ఇన్ను కొనుగోలు చేశారు. అలాగే.. 2018లో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను పంచుకొనేందుకు 7.5 బిలియన్ డాలర్లతో GitHub ని, తర్వాత Xbox Series S, Series X మరియు PCలలో ఆడటానికి, Sony ప్లేస్టేషన్ 5తో నేరుగా పోటీ పడేందుకు 7.5 బిలియన్ డాలర్లతో బెథెస్డామాతృ సంస్థ ZeniMax ను కొనుగోలు చేశారు. ఇవన్నీ సత్య నాయకత్వంలో తీసుకున్న కీలక నిర్ణయాలే.
గత పదేళ్లలో సత్య నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ కొన్ని సవాళ్లనూ ఎదర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు సైబర్ దాడులకు నిలవలేకపోవడం ఇందులో ముఖ్యమైనది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 వర్క్ టూల్పై రష్యా, చైనా హాకర్లు దాడిచేయటం, అమెరికా ప్రభుత్వ, మైక్రోసాఫ్ట్ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూజివ్ల్ మెయిళ్లను హ్యాకింగ్క గురయ్యాయి.
2014 ఫిబ్రవరి 4న ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యేనాటికి కంపెనీ మార్కెట్ విలువ 256.1 బిలియన్ డాలర్లు కాగా.. నేడు అది సుమారు 3 ట్రిలియన్ డాలర్లు. ఇక.. ఈ పదేళ్లలో కంపెనీ షేరు 100 రెట్లు పెరిగింది. అంటే.. 2014లో 10 వేల డాలర్లతో మైక్రోసాఫ్ట్ షేర్లు కొంటే.. దాని విలువ నేడు 1.13 లక్షల డాలర్లు.
పర్సనల్ లైఫ్
హైదరాబాద్లో పుట్టి పెరిగారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్లస్ 2 వరకు, మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిగ్రీ, విస్కోన్సిన్: మిల్వాకీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్, చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.
సన్ మైక్రో సిస్టమ్స్లో సత్య మొదటి ఉద్యోగం చేశారు. అది కంప్యూటర్లు, సాఫ్ట్వేర్, ఐటీ సేవలు విక్రయించే సంస్థ. 1992లో పాతికేళ్ల వయసులో మైక్రోసాప్ట్లో చేరారు. ఏడేళ్ల తర్వాత చిన్న బిజినెస్ హౌస్లకు వెబ్ సర్వీసులు అందించే విభాగానికి హెడ్ అయ్యారు. 2014లో ఏకంగా సీఈవో అయ్యారు.
భార్య అనుపమ. ఈమె కాలేజీలో సత్య జూనియర్. 1992లో వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు అమ్మాయిలు. వీరిలో పెద్ద కుమారుడు జైన్ 2022లో కన్నుమూశారు. సత్యకి లిటరేచర్, క్రికెట్ అంటే పిచ్చి. కవితలూ రాస్తారు. 2019లో సీటెల్ సౌండర్స్ సాకర్ క్లబ్ను ప్రమోట్ చేశారు. సీటెల్ పిల్లల హాస్పిటల్ కోసం రూ.123 కోట్ల డొనేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన బెల్లెవ్యూ- వాషింగ్టన్లో నివాసం ఉంటున్నారు. ఆయన సేవలకు పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా పొందారు.
2019లో ఫైనాన్షియల్ టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’ గా సత్య ఎంపికయ్యారు. 2020లో బ్యారన్స్ వరల్డ్స్ ’30 బెస్ట్ సీఈఓస్’ జాబితాకెక్కారు. మైక్రోసాఫ్ట్ షేర్లు, జీతభత్యాల రూపంలో లభించిన సొమ్ముతో సంపన్నుల జాబితాలోనూ ఆయనకు స్థానం లభించింది.
2021లో కొవిడ్ సమయంలో తన ఉద్యోగుల రక్షణ, భద్రత, సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. 2021లో టాప్ 100 కంపెనీల సీఈఓలతో ప్రముఖసంస్థ గ్లాస్డోర్ రూపొందించిన నివేదికలో ఆయనకు 6వ స్థానం దక్కింది.
‘హిట్ రిఫ్రెష్’ అనే పేరుతో తన ఆత్మకథ రాశారు. తన ఉద్యోగ ప్రస్థానం, ఎదుర్కొన్న సవాళ్లు, టెక్నాలజీ మార్పులు..వంటి ఎన్నో అంశాలను జోడిస్తూ ‘హిట్ రిఫ్రెష్’ అనే ఆత్మకథ రాశారు. ఈ పుస్తకం మీద వచ్చిన ఆదాయాన్ని మైక్రోసాఫ్ట్ సేవా కార్యక్రమాలకు కేటాయించారు. ఫ్రెడ్ హచిన్సన్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు.
సత్య తండ్రి యుగంధర్ ఐఏఎస్ అధికారి. ఈయన ముస్సోరిలోని ఐఏఎస్ అకాడమీకి డైరెక్టర్గా, ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. అనుపమ తండ్రి కేకే వేణుగోపాల్ కూడా ఐఏఎస్ అధికారే. ఈయన నలుగురు ప్రధానుల వద్ద సెక్రటరీగా సేవలందించారు.