Bonthu rammohan Going to Join Congress:
లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. గులాబీ దళంపై అసహనంగా ఉన్న నేతలు పార్టీకి గుడ్బై చెప్పి మరో గట్టుకు జంప్ అవుతున్నారు. ఇటీవలే పలువురు నేతలు బీఆర్ఎస్ను వీడగా.. ఆ జాబితాలో తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా చేరిపోయారు. మరికొందరు సీనియర్ నేతలు కూడా గులాబీకి గుడ్బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్కు వరుసషాక్లు తగులుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా గెలిచి తమ సత్తాను నిరూపించుకోవాలని తహతహలాడుతోంది. ఇలాంటి తరుణంలో పార్టీ తీరుపై అసహనంగా ఉన్న నేతలంతా తమ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తమకు అనుకూలంగా లేకపోతే పార్టీని వీడడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. ఓవైపు సమీక్షలు నిర్వహించి కేడర్లో ఉత్సాహాన్ని నింపే పనిలో అధిష్టానం బిజీగా ఉండగానే.. మరోవైపు గులాబీ శిబిరాన్ని వీడి ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్లో చేరేందుకు మక్కువ చూపుతున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ ఆశించి భంగపడ్డ రాజయ్యకు మరోసారి అదే అనుభవం ఎదురుకావడంతోనే పార్టీని వీడినట్టు తెలుస్తోంది. త్వరలో జరిగే ఎంపీ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ ఆశించగా అందుకు కూడా బీఆర్ఎస్ నో చెప్పడంతో రాజయ్య బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఇక కాంగ్రెస్లో చేరేందుకు రాజయ్య మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో టచ్లో ఉన్న ఆయన.. త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకోనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇదిలా ఉంటే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా బీఆర్ఎస్ను వీడే యోచనలో ఉన్నారు. మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఆయన తన ధిక్కార స్వరాన్ని వినిపించారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతానని హెచ్చరించారట.