IND vs ENG 3rd Test (sports news today) : ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్ట్ ల సిరీస్ కోసం మొదటి రెండు టెస్ట్ లకి జట్టుని ఎంపిక చేసిన బీసీసీఐ మూడో టెస్ట్ కోసం ఎదురుచూస్తోంది. నిజానికి రెండో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 6 తో ముగుస్తుంది. మూడో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 15న మొదలై 19 వరకు జరుగుతుంది.
రెండో టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత, ఇక 9 రోజులే సమయం ఉంటుంది. ఈ సమయంలో జట్టుని ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే రావల్సిన వాళ్లు ఇంకా నలుగురున్నారు. వారికోసం ఎదురుచూస్తున్నట్టుగా బీసీసీఐ తీరుని చూస్తే తెలుస్తోంది.
ఇంతకీ ఎవరా? నలుగురు? అంటే ఒకరు అందరికీ తెలిసిన విరాట్ కొహ్లీ, మిగిలిన ముగ్గురు గాయాలతో చికిత్స పొందుతున్న మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా. వీరిలో విరాట్ కొహ్లీ నుంచి ఇంకా సంకేతాలు రాలేనట్టుగా చెబుతున్నారు. తను మూడో టెస్ట్ ఆడతాడా? లేదా? అనేది సందిగ్ధంగానే ఉంది. అలాగే ఎన్ సీఏలో చికిత్స పొందుతున్న మిగిలిన ముగ్గురికి సంబంధించిన రిపోర్ట్ అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన మూడు మ్యాచ్ లకి జట్టుని ఎంపిక చేస్తారని అంటున్నారు. వీరి సంగతి తేలిన తర్వాతే జట్టు ఎంపిక ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం కీలకమైన నలుగురు ఆటగాళ్లు లేక టీమ్ ఇండియా గిలగిల్లాడుతోంది. కొత్తవారితో జట్టుని ముందుకు నడిపించలేక రోహిత్ శర్మ ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇది తన బ్యాటింగ్ పై ప్రభావం చూపిస్తోంది. అంతేకాదు రెండో టెస్ట్ లో తను, బుమ్రా ఇద్దరే సీనియర్లు కనిపిస్తున్నారు. మిగిలిన వారంతా కుర్రజట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో క్లిష్టమైన సమయంలో ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కోవడం వారి వల్ల కావడం లేదు. హైదరాబాద్ లో గెలవాల్సిన టెస్ట్ మ్యాచ్ ను, అందువల్లే ఓడిపోయారు.
ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం ఆటగాళ్లపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తోందనే విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి. వారు ఆటలో ఒత్తిడినే కాదు, బయట నుంచి వచ్చే తిట్లను భరించాల్సి వస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.