TS Cabinet Meeting (Telangana today news) : నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశంకానుంది. ఈ భేటీలో 25 అంశాలపై చర్చ జరగనుండగా.. గత ప్రభుత్వాల విధానాలపై సమీక్ష నిర్వహించనుంది. అలాగే పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది కేబినెట్.
ముఖ్యంగా ఆరు హామీలపై చర్చ జరగనుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు పథకాల అమలుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల అంశం కూడా కేబినెట్ మీటింగ్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ల కోసం అర్హులైన అభ్యర్థుల్ని ఎలా ఎంచుకోవాలి ? ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్న దానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండు పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో చూడాలి.
అలాగే టీఎస్ బదులుగా.. ఇకపై వెహికల్స్ రిజిస్ట్రేషన్ నంబర్లను టీజీగా మార్చే అంశంపైనా చర్చించనున్నారు. మధ్యాహ్నం జరిగే కేబినెట్ సమావేశానికి సుమారు 20-25 అంశాలతో అజెండా సిద్ధం చేసినట్లు సమాచారం. అన్ని శాఖల నుంచి సమాచారం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కార్యదర్శులను ఆదేశించారు.
ఈనెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనన్న నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే యోచనలో భాగంగా ఏ అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలన్న దానిపై చర్చించనుంది తెలంగాణ కేబినెట్. ఈ మేరకు ఆరు గ్యారెంటీల హామీల్లో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అలాగే తెలంగాణ పేరుకు సంబంధించి టీఎస్ను టీజీగా మార్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశాలతోపాటు రిటైర్డ్ ఉద్యోగస్తులను కొనసాగింపు, గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ కోసం కొత్త నోటిఫికేషన్ జారీపై కూడా చర్చించనుంది.