CEO Harassment : అమెరికాలో ఇన్ఫోగ్రావిటీ సంస్థ సీఈఓ తొండెపు చంద్రపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. సీఈఓ తొండెపు చంద్ర అమెరికాలో నివాసం ఉంటున్నాడు. అతను అక్కడే ఆ కంపెనీకి సీఈఓగా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి ఇండియాలో కూడా ఆ కంపెనీకి సంబంధించిన పలు శాఖలు ఉన్నాయి. ఇండియాలో తన కంపెనీ అభివృద్ధిలో భాగంగా నిరంతరం సంస్థలో ఉన్న ఉద్యోగులతో సమావేశం నిర్వహించేవాడు. సంస్థను అభివృద్ధి పరిచేందుకు ఉద్యోగులకు సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. అయితే సీఈవో మీటింగ్ల పేరుతో ఓ ఉద్యోగిపై వేధింపులకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ అమీర్పేట్ లో ఉన్న తన కంపెనీలో హెచ్ఆర్, లీగల్ మేనేజర్గా ఓ యువతి పనిచేస్తోంది. అమెరికాలో ఉంటున్న సీఈఓ తొండెపు చంద్రతో జూమ్ మీటింగ్లో తరచూ పాల్గోనేది. ఆమెను జూమ్ మీటింగ్లో చూసి మనసు పారేసుకున్నాడు. తన కంపెనీలో అందమైన అమ్మాయిలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేవాడు. మీటింగ్లో పాల్గోన్న ప్రతిసారి ఆమెను పొగిడేవాడు. సమావేశాల్లో కూడా సీఈఓ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. తనతో సన్నిహితంగా ఉండాలని ఆమెను వేధించేవాడు. కంపెనీ యజమాని కావడంతో యువతి ఏమీ అనలేకపోయింది.
గత ఏడాది డిసెంబర్ 22న చంద్ర.. అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చాడు. ఈ క్రమంలోనే అమీర్పేట్లో ఉన్న తన కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశం నిర్వహించాడు. ఈ క్రమంలో ఆమెను వేధించాడు. తన కోరిక తీర్చాలని ఆమెను లైంగికంగా వేధించాడు. జనవరి 2న నెక్లెస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్కు ఒంటరిగా రావాలని ఆమెకు తెలిపాడు. వేధింపులు ఎక్కవగా ఉండటంతో ఆమె తన ఉద్యోగానికి జనవరి 12న రాజీనామా చేసింది. ఈ విషయాన్ని సీఈఓకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. అయితే తనకు రిలీవింగ్ లెటర్, జీతం, లీగల్ సర్వీసస్ డ్యూస్ , ఎక్స్ పీరియన్స్ లెటర్స్ ఇవ్వాలని కోరింది. అయితే తన కోరిక తీరిస్తేనే వాటిని ఇస్తానని సీఈఓ ఆమెకు తెలిపాడు. వేధింపులతో విసిగిపోయినా ఆమె చివరకు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.