Deputy CM Narayana Swamy : అధికార పార్టీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ రిజర్వుడ్ స్థానాలలో అభ్యర్థుల మార్పు ప్రహాసనం ఎట్టకేలకు ముగిసింది. ఎంపీలుగా సిట్టింగులకే తిరిగి అవకాశం ఇవ్వడంతో పాటు.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి తిరిగి ఆయా సొంత నియోజకవర్గం జీడినెల్లూరు కేటాయించారు వైసీపీ అధ్యక్షుడు. నారాయణస్వామిని చిత్తూరు ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించి.. తిరిగి ఎమ్మెల్యే స్థానానికి రప్పించడం వెనుక మతలబు ఏంటి? మరో అసమ్మతి ఎమ్మెల్యే తయారవుతారని వైసీపీ పెద్దలు భయపడ్డారా? లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా?
ఎస్సీ నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పు పక్రియ వైసీపీలో పెద్ద ప్రహసనంగా మారింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో పలు చోట్ల ఈ మార్పులు చేర్పులతో ప్రజాప్రతినిధులు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కొత్త అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల సిట్టింగులు.. ఇంకా ఆశచావక.. చివరి నిముషంలో తమకే చాన్స్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. తమ సెగ్మెంట్లకు నూతన ఇన్చార్జిలను ప్రకటించడంతో.. ఇప్పటికే ఇద్దరు తిరుగబాటు జెండా ఎగరవేశారు. మరికొందరని అధిష్టానం బుజ్జగించడానికి ఆపసోపాలు పడుతోంది.
మూడో జాబితాలో జీడినెల్లూరు ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం నారాయణస్వామిని చిత్తూరు ఎంపి స్థానం ఇన్చార్జ్గా ప్రకటించి.. చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను జీడి నెల్లూరు అసెంబ్లీ స్థానానికి షిప్ట్ చేసింది వైసీపీ. అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు ఇన్చార్జ్గా ప్రకటించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని తిరుపతి ఎంపి స్థానానికి షిఫ్ట్ చేశారు. దాంతో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్టీ పైన అదే విధంగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి పై నిప్పులు చెరిగి టిడిపి గూటికి చేరడానికి సిద్దం అయ్యారు.
అదే సమయంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వర్గం తీవ్ర స్థాయి నిరసనలకు దిగింది. మీటింగులు పెట్టుకుని.. రెడ్డెప్ప వద్దు నారాయణ స్వామి కావాలని తీర్మానాలు చేసింది. ఆ క్రమంలో ఐదో జాబితాలో మాజీ మంత్రి కుతుహాలమ్మ సోదరి కూమారుడు అయిన నూకతోటి రాజేష్ను సత్యవేడు అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు.. గురుమూర్తికి తిరుపతి ఎంపి అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రకటన చేశారు.
ఆ జాబితాలో నారాయణస్వామికి తిరిగి జీడినెల్లూరు నుంచి పోటీకి అవకాశం కల్పించారు. దీంతో పాటు రెడ్డెప్పను తిరిగి చిత్తూరు ఎంపి ఇన్చార్జిగా అధిష్టానం ప్రకటించింది. దీని వెనుక మతలబు ఏమిటని ఇప్పుడు నియోజక వర్గ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే అసలు కారణం మాత్రం తమిళ మాల సామాజిక వర్గం అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. చిత్తూరు జిల్లాలో తమిళమాలలు కుప్పం, చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు, తిరుపతి, జీడినెల్లూరు, నగరి , సత్యవేడు.. కాళహస్తి నియోజకవర్గాలలో ఎక్కువగా ఉంటారు.
వారంతా ఎన్నికల సమయంలో తమసామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆ లెక్కలతోనే వైసీపీ గత ఎన్నికలలో పూతల పట్టు నుంచి ఎంఎస్ బాబు, సత్యవేడు నుంచి ఆది మూలం, జీడినెల్లూరు నుంచి నారాయణ స్వామికి అవకాశం కల్పించి గంపగుత్తగా ఓట్లను కొల్లగొట్టింది. టిడిపి మాత్రం ఈ స్థానాలలో తెలుగు మాలలకు అవకాశం కల్పించి దెబ్బతిందన్న విశ్లేషణలు ఉన్నాయి.
వచ్చే ఎన్నికలకు మార్పులు చేర్పుల కసరత్తు మొదలుపెట్టిన వైసీపీ.. పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబును తప్పించి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కు ఇన్చార్జి బాధ్యతలు కట్టబెట్టింది. అదే సమయంలో ఆదిమూలాన్ని, నారాయణ స్వామిని ఎంపీలుగా పంపడానికి ప్రయత్నించడం. దాన్ని వారు వ్యతిరేకించడంతో వారి సామాజిక వర్గాలలో అలజడి మొదలయింది.
తమిళ మాల సామాజిక వర్గాలు తమ ప్రాబల్యం చాటుకోవడానికి అంబేద్కర్ సంఘాల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఒక్క చిత్తూరు అసెంబ్లీ పరిధిలో వారివి 13 శాతం ఓట్లు ఉన్నాయి. జీడినెల్లూరులో అత్యధికంగా 28 శాతం ఓటు బ్యాంకు వారిదే.. సత్యవేడులో 27, పూతలపట్టులో 24 శాతం ఓటు బ్యాంకుతో ప్రభావితంగా ఉన్నారు. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ వారు గణనీయంగానే కనిపిస్తారు.
ఆ లెక్కలతోనే వైసీపీలో అంతర్మధనం మొదలైందంటున్నారు. ముఖ్యంగా నారాయణ స్వామి, ఆది మూలం ఆయా సామాజిక వర్గాలలో పట్టు ఉన్న నాయకులు.. వీరు కుప్పం నుంచి సత్యవేడు వరకే కాకుండా.. సూళ్ళురుపేటలో ఉన్న తమిళ మాల సామాజిక వర్గాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుంటారు. అదే వర్గానికి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తప్పించినప్పుడు.. ఆయన ఒక్క రోజు పార్టీ పెద్దలపై విమర్శలు గుప్పించి.. తర్వాత సైలెంట్ అయిపోయారు.
అయితే ఆదిమూలం తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేయడమే కాకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనంపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో తాను దళిత నాయకుడినని గ్రామ స్థాయి నుంచి రాజకీయం తెలుసని హెచ్చరించారు. నారాయణ స్వామి సైతం ఇదే రూటులోకి వెళతారని వైసీపీ పెద్దలు అనుమానించినట్టు కనిపిస్తోంది. అదీకాక టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు అయన సామాజిక వర్గాన్ని సైతం తూర్పార పట్టడంలో ముందుంటారు నారాయణస్వామి.
అలాంటి వ్యక్తి తమ మీదా విమర్శల దాడి చేస్తే ఇబ్బందిగా ఉంటుందని భావించారో ? లేక తమిళ మాలల ఎపెక్ట్ జిల్లా అంతటా పడుతుందని లెక్కలేసుకున్నారో? కాని నారాయణ స్వామికి తిరిగి జీడి నెల్లూరు నుంచే పోటీకి అవకాశం కల్పించారు. మొత్తమ్మీద ఆది మూలం తిరుగుబాటు నారాయణ స్వామికి కలసి వచ్చిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.