TDP Party Latest news(AP election updates): తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఈ సారి మాజీ మంత్రి జవహర్కు కొవ్వూరు టికెట్ కేటాయించవద్దంటున్నారు అక్కడి టీడీపీ నేతలు కొందరు.. మీటింగ్ పెట్టుకుని మరీ తమ వ్యతిరేకతను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేతలు ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ఏకమై బహిరంగంగానే జవహర్ను వ్యతిరేకిస్తుండటం.. పార్టీ శ్రేణులకు మింగుడు పడకుండా తయారైందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ పెద్దల నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
సరిగ్గా ఎన్నికల ముందు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సెగ్మెంట్ టీడీపీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. కొవ్వూరు పార్టీ ఇన్చార్జ్ , మాజీ మంత్రి జవహర్కు వ్యతిరేకంగా అక్కడి ముఖ్య నాయకులు మీటింగ్ పెట్టుకుని.. జవహర్ మాకొద్దు అంటూ తీర్మానం చేశారు. ఒకరిద్దరు తప్ప కొవ్వూరు కు చెందిన ముఖ్య నేతలు అందరూ ఆ సమావేశానికి హాజరై.. జవహర్ వద్దు.. టీడీపీ ముద్దు.. అంటూ ప్లకార్డు లు ప్రదర్శించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కేఎస్ జవహర్ అభ్యర్థిత్వం ఖరారయ్యే సూచనలున్నాయన్న సంకేతాలతో ఆయన వ్యతిరేక వర్గం కొన్నాళ్లుగా అసంతృప్తి గళం వినిపిస్తూవస్తోంది.
జవహర్ని టార్గెట్ చేసుకుని.. కొవ్వూరు పార్టీ సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు వర్గీయులు కొంతకాలంగా ముఖ్యనేతలను కూడగట్టే పనిలో పడ్డారు. ఆ క్రమంలో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశం పేరిట.. స్థానిక కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశానికి అచ్చిబాబు వర్గీయులు సారథ్యం వహించారు. ఆ మీటింగ్లో జవహర్ కు టికెట్టు ఇవ్వవద్దన్న సింగిల్ అజెండాని బలంగా వినిపించారు. గత కొద్దికాలంగా తనకు టికెట్టు వచ్చినట్లు జవహర్ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవానికి కృష్ణా జిల్లా తిరువూరు వాస్తవ్యుడైన జవహర్ ఉపాధ్యాయ వృత్తిని వదులుకుని 2014లో టీడీపీలో చేరి.. కొవ్వూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 2017 మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్త్ దక్కింది. ఇక 2019లో తిరువూరు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి మళ్లీ కొవ్వూరు తిరిగొచ్చి టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ నాయకులను గ్రూపులుగా విభజించి రాజకీయం చేశారని.. ఆయనకు మళ్లీ టికెట్ కేటాయిస్తే పార్టీలో వర్గ విభేదాలు తిరిగి తలెత్తుతాయని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.
జవహర్ కు టికెట్ కేటాయిస్తే.. తాము మద్దతిచ్చే ప్రస్తక్తేలేదని.. పైపెచ్చు వ్యతిరేకంగా పని చేస్తామని తాజా మీటింగులో ఆయన వ్యతిరేకులు అల్టిమేటం ఇవ్వడం గమనార్హం. కొవ్వూరు టీడీపీ ముఖ్యనేత అచ్చిబాబు నాయకత్వంలో తామంతా పనిచేస్తామని.. అచ్చిబాబు నిర్ణయించిన అభ్యర్థికే మద్దతు ప్రకటిస్తామని.. అచ్చిబాబును కాదని అభ్యర్ధిని ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
కొవ్వూరు నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకూ పార్టీని రెండు వర్గాలుగా విడదీసి జవహర్ భ్రష్టు పట్టించారని నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 2020లో అధిష్టానం ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసి, గ్రూపులను సమన్వయ పరిచే ప్రయత్నం చేసినా.. జవహర్ కారణంగా మళ్లీ గ్రూప్ వార్ స్టార్ట్ అయిందంటున్నారు.. ఇటీవల రాజమహేంద్రవరంలో రా.. కదలిరా సభ నిర్వహించినప్పుడు, చంద్రబాబు అరెస్టు సమయంలోనూ.. పార్టీని రెండు గ్రూపులుగా విభజించి జవహర్ కార్యక్రమాలు నిర్వహించారని వారంతా మండిపడుతున్నారు.
2021లో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జవహర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తూ.. ఏకపక్ష నిర్ణయాలు, నచ్చిన వారికే పార్టీ పదవులు కట్టబెట్టారని వ్యతిరేకవర్గం వాదిస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మాని.. శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లడమే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల సమయంలో కూడా అచ్చిబాబు వర్గం జవహర్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో టీడీపీ అధిష్టానం దిగివచ్చి జవహర్ను తిరువూరుకి షిఫ్ట్ చేసింది. అక్కడ ఓటమి పాలైన జవహర్.. ఐదేళ్ల నుంచి కొవ్వూరు కేంద్రంగానే రాజకీయం చేస్తున్నారు. ఇటీవల పార్టీ ఐవీఆర్ఎస్ సర్వేలో జవహర్పైనే అభిప్రాయ సేకరణ జరిగింది. దాంతో ఆయనకు పొగ పెట్టేందుకు వ్యతిరేకవర్గం ప్రయత్నాలు ప్రారంభించింది. మరి ఈసారి జవహర్ విషయంలో టీడీపీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.