India-Maldives Diplomatic Tensions : భారత్ (India), మాల్దీవుల (Maldives) మధ్య దౌత్యపరమైన వివాదం ముదురుతోంది. రెండు దేశాల సంబంధాలు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి ఒక ప్రకటన చేసింది. జనవరి 31న విదేశీ మిలిటరీకి చెందిన సిబ్బంది.. మాల్దీవుల ఫిషింగ్ ఓడలో ఎక్కినట్లు సమాచారం అందిందని ఆ ప్రకటనలో పేర్కొంది. అక్కడికి చేరుకోగానే వారు భారత తీర రక్షక దళానికి చెందినవారని తేలిందని స్పష్టం చేసింది. భారత తీర రక్షక సిబ్బంది మరో రెండు పడవల్లో ఎక్కినట్లు మాల్దీవుల మిలిటరీ గుర్తించిందని తెలిపింది.
ఈ విషయంపై మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఫిబ్రవరి 1, 2024న భారత్ను వివరణ కోరుతూ అధికారికంగా లేఖ రాసింది. ఎక్స్క్లూజీవ్ ఎకనామిక్ జోన్లో మాల్దీవులు చేపలు పట్టే సమయంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లఘించి భారత్ ఆపరేషన్ చేపట్టిందని.. దానిపై వివరణ ఇవ్వాలని తెలిపింది. తమ దేశానికి చెందిన ఫిషింగ్ బోట్లను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని.. సమగ్ర వివరాలు సమర్పించాలని ఆ లేఖలో పేర్కొంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ 246, 253 బృందాలు ఫిషింగ్ బోట్లను ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపింది. కాగా దీనిపై భారత్ ఇప్పటివరకు స్పందించలేదు.
మహ్మద్ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. భారత్ సైనిక బలగాలు తమ దీవులను విడిచి వెళ్లిపోవాలని ముయిజ్జు గడువు విధించిన సంగతి తెలిసిందే.