Vasantha Krishna Prasad (latest breaking news in telugu):
ఆయన ముక్కుసూటి తనం సిట్టింగు సీటుని దూరం చేసిందా?.. నిజాలు మాట్లాడినందుకే వైసీపీ ఆయన్ని దూరం పెట్టిందా? ఆ నియోజకవర్గంలో సొంత సామాజికవర్గం ప్రాబల్యం ఉన్నప్పటికీ.. ఆ ఎమ్మెల్యేకి టికెట్ ఎందుకు దక్కలేదు? వేరే సామాజిక వర్గానికి సీటు కేటాయించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఈ ప్రశ్నలే ఎక్కువగా వినపడుతున్నాయి. అసలు ఆ నియోజకవర్గంలో ఏది? ఎందుకు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు పార్టీ మరోసారి అవకాశం ఇవ్వలేదు?
కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు.. గత ఎన్నికల్లో మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా.. అప్పటి వరకూ ఓటమి ఎరుగని మాజీ మంత్రి దేవినేని ఉమను ఓడించిన వసంత.. ఒకరకంగా కృష్ణా జిల్లా వైసీపీలో హీరో అయ్యారు. వసంత కృష్ణ ప్రసాద్ది రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబమే.. ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు ఎన్టీఆర్ హయాంలో టీడీపీ మంత్రిగా జిల్లాలో చక్రం తిప్పారు. తర్వాత టీడీపీకి దూరమయ్యారు.
వసంత కుటుంబం దేవినేని ఫ్యామిలీతో తొలి నుంచి తలపడుతున్నా చాలా కాలానికి పైచేయి సాధించగలిగింది గెలుపు దక్కింది. నందిగామ సెంటర్ గా రాజకీయాలు చేసిన రెండు కుటుంబాలు అది ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో మైలవరానికి షిఫ్ట్ అయ్యాయి. కమ్మ సామాజికవర్గానికి చెందిన వసంత కృష్ణ ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఆర్థికంగా కూడా బలంగా స్థిరపడ్డారు. ఆయన తొలి నుంచి కాంగ్రెస్తోనూ, తర్వాత వైసీపీతోనూ సంబంధాలు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు.
మధ్యలో టీడీపీకి వెళ్లినా.. గత ఎన్నికల ముందు వసంత వైసీపీలోకి చేరి మైలవరం టిక్కెట్ దక్కించుకుని గెలిచారు. అయితే అప్పటి వరకు మైలవరం వైసీపీ బాధ్యతలు నిర్వర్తించిన ప్రస్తుత మంత్రి జోగి రమేష్కు, వసంతకు మధ్య విభేదాలు తలెత్తాయి. మైలవరంలో తన మనుషులకే నామినేటెడ్ పదవులను ఇప్పించుకున్న జోగి రమేష్.. అధికారుల నియామకంలోనూ చక్రం తిప్పడాన్ని వసంత కృష్ణప్రసాద్ సహించలేకపోయారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది.
వైసీపీ పెద్దలు ఇద్దరినీ ఇరువురిని పిలిచి పంచాయతీ పెట్టినా.. వారి చేతులు కలవలేదు. మనస్పూర్తిగా ఇద్దరూ మాట్లాడుకుందీ లేదు. కలసి పనిచేసిందీ లేదు. 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన జోగి రమేష్.. తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడమేంటన్న వసంత ప్రశ్నకు హైకమాండ్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. ఆయనలో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ మంత్రి అయిన నాటి నుంచి మైలవరంలో ఆయన పెత్తనం మరింత పెరిగిపోయిందని వసంత వర్గం వాదన.
జోగి రమేష్ వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ల ఆధిపత్యపోరులో వైసీపీ పెద్దలు జోగి రమేష్ పక్షానే ఉన్నట్లు కనిపించారు. దానికి తోడు వసంత ముక్కు సూటితనం, ఇటీవల ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో వారు మైలవరంలో కొత్త ఇన్చార్జ్ని నియమించారట.. 2014లో చేసిన బీసీ కార్డు ప్రయోగాన్ని వైసీపీ వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ మొదలుపెట్టింది. జోగి రమేష్ వర్గీయుడు , మైలవరం జడ్పీటీసీ, యాదవ సామాజికవర్గానికి చెందిన తిరుపతిరావుకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారంట వైసీపీ పెద్దలు.
మైలవర్గం నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 70 వేలకు పైగా ఓట్లు ఉంటే.. అందులో బీసీ వర్గానికి చెందిన ఓట్టు లక్షా నలబై వేల వరకు ఉండటంతో.. వైసీపీ మరోసారి బీసీ కార్డును ఉపయోగించి గెలుపొందాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వైసిపి చేస్తున్న ప్రయోగం సక్సెస్ అవుతుందా? లేక 2014 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయా? అనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా ముక్కు సూటి తనం.. పార్టీపై వ్యతిరేక కామెంట్లు చేయటం.. మంత్రి జోగి రమేష్ చక్రం తిప్పడం వల్లే వసంతకు సీటు దూరమైందన్న చర్చ నియోజకవర్గంలో సాగుతుంది. మరిప్పుడు వసంత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.