Mallikarjun Kharge : రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ్ యాత్ర దేశాన్ని రక్షించడానికేనని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఒకవేళ ఈ పోరాటం విఫలమైతే దేశ ప్రజలకు కష్టాలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ఈ పోరాటం విఫలమైతే మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కష్టాలు తప్పవని పేర్కొన్నారు. పార్టీలో ఏఒక్కరూ తీసుకోని సాహసోపేత నిర్ణయం రాహుల్ గాంధీ తీసుకున్నారని కొనియాడారు. ఈ మేరకు తూర్పు ఢిల్లీలో జరిగిన ‘న్యాయ్ సంకల్ప్ సమ్మేళన్’ ఖర్గే ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.
యువత, మహిళలు, రైతులు, పేదలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టారని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ప్రతికూల, శీతల వాతావరణంలో ఈ యాత్ర కొనసాగుతోందన్నారు. బీజేపీ అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం అని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలన్నారు. లేకపోతే మోదీకి బానిసలుగా మిగిలిపోవాల్సి ఉంటుందని ఖర్గే పేర్కొన్నారు.
యువతకు ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి రప్పిస్తామంటూ బూటకపు హామీలతో మోదీ గద్దెనెక్కారని ఖర్గే విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే మోదీ గ్యారెంటీ అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే.. కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షానికి చెందిన 411 మంది శాసనకర్తలపై కేసులు పెట్టి..బీజేపీ జైలుకు పంపిందన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టి ఆయా రాష్ట్రాల్లో అధికారం చేపడుతోందని దుయ్యబట్టారు. ఝార్ఖండ్లో ఆ పార్టీ చేస్తున్న కుటిల యత్నాలు ఎంతమాత్రం ఫలించవని ఖర్గే అన్నారు. ఢిల్లీలో బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.