LK Advani : దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’తో కేంద్రం తనను గౌరవించడంపై రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ (LK Advani) స్పందించారు. ఇది తన ఆశయాలు, సిద్ధాంతాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. భారతరత్న పురస్కారాన్ని అత్యంత వినయం, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నానన్నారు. ఇది కేవలం నాకు మాత్రమే దక్కిన గౌరవం కాదన్నారు. జీవితాంతం సేవ చేయడానికి నేను నమ్ముకున్న సిద్ధాంతాలు, ఆశయాలకు దక్కిన గౌరవమని అద్వానీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీకి, ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ శుభ సమయంలో వెన్నుదన్నుగా నిలిచిన కుటుంబ సభ్యులు, ఈ లోకం విడిచి వెళ్లిపోయిన భార్య కమలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎల్ కే అద్వానీ అన్నారు. వాళ్ల సహకారంతోనే ప్రజలకు సేవ చేయగలిగానని చెప్పారు. వాళ్లే తన బలమని అన్నారు. 14 ఏళ్లలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో వాలంటీర్గా చేరినప్పటినుంచి.. స్వలాభం కోసం ఏనాడూ ఆలోచించలేదన్నారు. నిస్వార్థంగా దేశం కోసమే అంకితభావంతో పని చేశానని పేర్కొన్నారు.
భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయతో కలిసి పనిచేసిన రోజులను ఈ సందర్భంగా ఎల్ కే అద్వానీ నెమరువేసుకున్నారు. తనకు ఇంతటి గౌరవం లభించడంలో కీలకపాత్ర పోషించిన పార్టీ నాయకులు, సంఘ్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్కే అడ్వాణీని భారతరత్నతో గౌరవిస్తున్నట్లు శనివారం ఉదయం ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.