Paytm Services : రిజర్వ్ బ్యంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సర్వీసులపై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకు వినియోగదారుల నుంచి ఎలాంటి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ను అనుమతించడం లేదని, కొత్తగా డిపాజిట్లు కానీ టాప్ అప్స్ కానీ స్వీకరించడం లేదని చెప్పింది. పేమెంట్స్ బ్యాంకుతో లింక్ అయిన వాలెట్స్, ఫాస్ట్ ట్యాగ్స్ కూడా పనిచేయవని జనవరి 31న ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎందుకు ఆర్బీఐ పేటీఎంపై ఆంక్షలు విధించింది?
సమగ్ర సిస్టం ఆడిట్, ఇతర ఆడిటర్ల నివేదిక మేరకు పేటీఎం పై ఆంక్షలు ఆర్బీఐ విధించింది. పేమెంట్స్ బ్యాంకులో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన ఆర్బీఐ.. పేటీఎంపై చర్యలు తీసుకుంది.
వేటికి మినహాయింపు?
పేమెంట్స్ బ్యాంకులోని సేవింగ్స్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, ఫాస్టాగ్స్, ఎంఎమ్సీ కార్డ్స్లో ఉన్న నిల్వల విత్ డ్రా, వాటి వినియోగంపై వినియోగదారులకు ఎలాంటి ఆంక్షలు ఉండవని ఆర్బీఐ స్పష్టం చేసింది. క్యాష్ బ్యాక్, వడ్డీ, రిఫండ్స్కి ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది.
ఏ ఇతర సేవలను ఆర్బీఐ నిషేధించింది?
ఫిబ్రవరి 29, 2024 తర్వాత బ్యాంక్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్స్, BBPOU, UPI సౌకర్యాలు వంటి ఇతర బ్యాంకింగ్ సేవలను పేటీఎం పేమెంట్స్ బ్యాంకు అందించరాదని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
వినియోగదారులు ఏం చెయ్యాలి ?
పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో ఉన్న నగదును విత్ డ్రా చేసుకొవడం కానీ, వేరే బ్యాంకు ఖాతాలకు కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. యూపీఐ సేవలో పేమెంట్స్ బ్యాంకును వినియోగిస్తే వేరే బ్యాంకు అకౌంట్కు లింక్ చేసుకోవాలి. ఫ్యూచర్ లావాదేవీల కోసం ఇతర వాలెట్లను ఉపయోగించడం ఉత్తమం.
పేటీఎం స్పందన ఏంటి?
ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పనిచేస్తుందని.. సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. పేటీఎం క్యూఆర్, పేటీఎం సౌండ్ బాక్స్, కార్డ్ మెషీన్ లాంటి ఆఫ్లైన్ మర్చంట్ పేమెంట్ సర్వీసెస్ కొనసాగుతాయని పేర్కొన్నారు.