Nara Lokesh : జగన్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వైసీపీ పాలనని అంతమొందిచేందుకు ఉద్యోగులంతా ఆత్మస్థైర్యంతో ఉండాలని కోరారు.
విశాఖ జిల్లాలో భూ అక్రమాలకు సహకరించలేదని వైసీపీ నేతలే తహసీల్దార్ రమణయ్యను అత్యంత దారుణంగా హత్య చేశారని లోకేశ్ ఆరోపించారు. అవినీతి, అక్రమాలు, వేధింపులతో ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారం కోసం జగన్ సొంత బాబాయ్నే హత్య చేశారని లోకేశ్ ఆరోపించారు. జగన్ గ్యాంగ్ తమ దోపిడీకి సహకరించని ఉద్యోగుల అడ్డు తొలగించుకుంటోందన్నారు. వైసీపీ నేతల అవినీతికి వారెందుకు బలి కావాలని ప్రశ్నించారు.
జగన్ ఐదేళ్ల పాలనలో వందల మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయరని లోకేశ్ ఆరోపించారు. ఈ వారంలోనే ముగ్గురు ఉద్యోగులు బలి అయ్యారని తెలిపారు. ఈ ఫ్యాక్షన్ సర్కారు అంతానికి ఇంకా 2 నెలలే సమయం ఉందన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిందితులను కఠినంగా శిక్షిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.