Congress MP Seat Applications : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్కొక్క హామీని దశలవారిగా అమలు చేస్తూ వస్తోంది. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో.. కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఎంపీ సీటు కోసం.. పక్క పార్టీని వీడి మరీ హస్తం గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ దరఖాస్తులకు భారీగా డిమాండ్ పెరిగింది. కాంగ్రెస్ తరుపున ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు భారీగా దరఖాస్తులు అందుతున్నాయి.
శుక్రవారం ఒక్కరోజే భారీగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు 140 మంది పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్రావు, సినీ నటుడు బండ్ల గణేష్ అప్లికేషన్లు ఆసక్తిగా మారాయి. సికింద్రాబాద్, ఖమ్మం పార్లమెంట్కు గడల శ్రీనివాస్రావు దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి.. బండ్ల గణేష్ అప్లై చేసుకోగా.. మహబూబ్నగర్ పార్లమెంట్కు DGP కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న.. డుంగ్రోత్ నాగరాజు దరఖాస్తు చేసుకున్నారు.
మరోవైపు ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలిచేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఈ రోజు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోనున్నారు. ఆమె ఈ రోజు 500 కార్లతో ఖమ్మం నుంచి హైదరాబాద్ గాంధీ భవన్ కు ర్యాలీ నిర్వహించనున్నారు.
మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వరంగల్, పెద్దపల్లి.. నియోజకవర్గాల నుంచి భారీగా దరఖాస్తులు అందాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు కూడా అదే దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అభ్యర్థుల వేట కోసం ప్రయత్నిస్తున్న టీ కాంగ్రెస్.. దరఖాస్తులను అందుబాటులో ఉంచింది. కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. ఈ రోజుతో దరఖాస్తు గడువు ముగుస్తున్న వేళ.. ఆశావహులు స్పీడ్ పెంచారు. ఇప్పటికే 140 మంది కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ రోజు మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
చిత్రమేమిటంటే.. కాంగ్రెస్ నుంచి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పలువురు ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మల్కాజిగిరి లాంటి అతి పెద్ద నియోజకవర్గానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మల్కాజిగిరి ఎంపీ స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కపిలవై దిలీప్ కూడా ఈ స్థానం నుంచే ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు మర్రిజనార్థన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే అదే నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ అడిగే అవకాశం ఉంది. అదే జరిగితే టి-కాంగ్రెస్ అధిష్టానం ఈ ముగ్గురిలో ఎవరికి మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ కేటాయిస్తుందో చూడాలి.