LK Advani Bharat Ratna : ఆయనది నిండైన జీవితం. రాజకీయంగా మచ్చ లేని ప్రస్థానం. తన రథయాత్రతో రెండు సీట్లున్న బీజేపీని 80 స్థానాలకు చేర్చిన రాజకీయ యోధుడు. హిందుత్వ రాజకీయాలను దేశవ్యాపితం చేసిన వినూత్న రాజకీయ నాయకుడు. ఆయనే లాల్ కిషన్ అద్వానీ. నేడు భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో ఒక్కసారిగా ఆనందం వ్యక్తమైంది.
పాకిస్థాన్ లోని కరాచీ ప్రాంతంలో 1927 నవంబర్ 8న ఒక సంపన్న సింధీ కుటుంబంలో అద్వానీ జన్మించారు. తల్లిదండ్రులు జ్ఞానీదేవి, కిషన్చంద్ అద్వానీ. సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్ మరియు దయారామ్ గిడుమల్ నేషనల్ కాలేజీలో చదువుకున్న అద్వానీ బొంబాయిలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. ముంబై యూనివర్సిటీలో సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. విద్యాభ్యాసం తర్వాత కొన్నాళ్లు.. కరాచీలోని మోడల్ హై స్కూల్లో హైస్కూల్ విద్యార్థులకు ఇంగ్లీష్, చరిత్ర మరియు సైన్స్ బోధించారు.
దేశ విభజన తర్వాత ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన కుటుంబం భారత్కు తరలి రావాల్సి వచ్చింది. భారత్ చేరిన తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యదర్శిగా ఎన్నికై, దేశ వ్యాప్తంగా దాని విస్తరణకు కృషిచేసిన అద్వానీ, జనసంఘ్ పార్టీలో చేరి పలు బాధ్యతలను నిర్వర్తించి, ఆ పార్టీ అధ్యక్షుడిగానూ సేవలందించారు. తర్వాతి రోజుల్లో ఆ పార్టీ భారతీయ జనతా పార్టీగా మారిన తర్వాత ఆయన ఎంపీగా పలుమార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1977లో ఏర్పడిన జనతా పార్టీలో సమాచార మంత్రిగానూ పనిచేసిన అద్వానీ.. 1999లో వాజ్పేయి ప్రభుత్వంలో భారత ఉపప్రధానిగా సేవలందించారు.
80వ దశకంలో రామజన్మభూమి ఉద్యమాన్ని భుజాలకెత్తుకున్న అద్వానీ అయోధ్యలో భవ్యమైన మందిరాన్ని నిర్మించి తీరతామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయన ప్రకటనకు లక్షలాది మందిని ఆయన అనుచరులుగా మార్చింది. సోమనాథ్ ఆలయం నుంచి ఆయన ప్రారంభించిన రథయాత్ర సమస్తీపుర్ చేరుకునేసరికి నాటి బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అడ్వానీని అరెస్ట్ చేయించారు. ఇది దేశంలో తీవ్రమైన ఉద్రికత్తలకు దారితీసింది. అనంతర కాలంలో కరసేవ పేరుతో బాబ్రీమసీదును పడగొట్టడానికి కుట్ర పన్నారనే అభియోగాలనూ ఎదుర్కొన్నా.. అంతిమంగా కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. కానీ.. ఇందిరాగాంధీ మరణం రెండు సీట్లకే పరిమితమైన బీజేపీని తర్వాతి ఎన్నికల్లో ఏకంగా 80 సీట్లకు చేర్చటంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు.
బీజేపీ సాధించిన రాజకీయ ఫలాలను తానొక్కడే అనుభవించాలని అద్వానీ ఏనాడూ భావించలేదు. తాను ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పటికీ.. తన ప్రియ మిత్రుడైన వాజ్పేయిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి తాను తెరవెనుక పాత్రకే పరిమితమయ్యారు. అంతేకాదు.. ప్రమోద్ మహాజన్, నరేంద్రమోదీ, అద్వానీ, ఉమాభారతి, కల్యాణ్ సింగ్ వంటి వందలాది మందిని రాజకీయ నేతలుగా తీర్చి దిద్ది రాజకీయంగా వారికి కీలక స్థానాలు దక్కేలా చేశారు.
పార్టీ పరంగా, ప్రభుత్వపరంగానూ ఎన్నో భాధ్యతలను నిర్వర్తించిన అద్వానీని ప్రధానిగానూ చూడాలని ఆయన అభిమానుల కోరిక తీరకుండానే పోయింది. 2014లో పూర్తి మెజారిటీ వచ్చినప్పుడు.. ఆయనను కొంతకాలం ప్రధానిగా చేసిన తర్వాతే మోదీ బాధ్యతలు నిర్వర్తిస్తారనే వార్తలు వచ్చినా అవి వాస్తవరూపం దాల్చలేదు. 2017లో జరిగిన రాష్ట్రపతిగానైనా ఆయనను చూసుకోవాలన్న అనుచరుల కల కల్లగానే మిగిలింది.
పార్టీలో ఆయన మార్గదర్శకుడిగా ఉన్నారంటూ చెప్పుకొచ్చిన పార్టీ నాయకత్వం మాటలకే పరిమితం కావటంతో 2019 నాటికి అద్వానీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. నాటి నుంచి ఆయన పుట్టినరోజు వేడుకలకు హాజరవటం తప్ప మోదీ నాయకత్వంలోని బీజేపీ ఆయనను పట్టించుకోలేదనే చెప్పాలి. అయోధ్య ఉద్యమాన్ని ముందుండి నడిపించిన అద్వానీ.. ఇటీవలి రామమందిర ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికీ రాకపోవటం పలువురిని నిరాశపరచింది.
బీజేపీకి దశ దిశా చూపిన రాజకీయ కురు వృద్ధుడు అద్వానీకి కాషాయం పార్టీలో తీరని అన్యాయం జరిగిందనే భావన బలంగా ఉన్నవేళ.. భారత ప్రభుత్వం ఆయనకు దేశ సర్వోన్నత పౌర పురస్కారమైన భారత రత్నను ప్రకటించటంతో దేశ వ్యాప్తంగా ఆయన అనుచరులు, అభిమానుల్లో గొప్ప సంతోషం వెల్లివిరుస్తోంది.