US Strikes : జోర్డాన్లో యూఎస్ స్థావరాలపై దాడులకు అమెరికా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ల స్థావరాలు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్లను లక్ష్యంగా చేసుకుని యూఎస్ వార్ జెట్స్ దాడి చేశాయి. అమెరికా వైమానిక దాడుల్లో ఆరుగురు మిలీషియా ఫైటర్లు మృతి చెందినట్టు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు నాన్ సిరియన్లు ఉన్నట్లు సమాచారం.
వారం రోజుల క్రితం జోర్డాన్లోని సైనిక స్థావరంపై ఉగ్రమూక చేసిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు చనిపోయారు. దీనికి ప్రతీకారదాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అప్పుడే చెప్పారు. దాడికి ప్లాన్ కూడా రెడీ చేస్తున్నామని అన్నారు. చెప్పినట్టుగానే అమెరికా ఎటాక్స్ మొదలు పెట్టింది. మొత్తం 85 మిలీషియా స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. దీర్ఘశ్రేణి బాంబర్లు వైమానిక దాడుల్లో పాల్గొన్నట్టు యూఎస్ మిలిటరీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కంట్రోల్ సెంటర్లు, రాకెట్, క్షిపణి, డ్రోన్ నిల్వల గోడౌన్ లతో పాటు లాజిస్టిక్స్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని యూఎస్ వైమానిక దాడులు జరిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే సమయంలో సిరియాలోని ఎడారి ప్రాంతాలు, ఇరాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్న లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడిలో పలువురు మృతి చెందగా.. అనేక మందికి గాయాలయ్యాయని సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది.
ఇజ్రాయిల్, హమాస్ యుద్దం ప్రారంభమైన తర్వాత ఈ దాడులు పశ్చిమాసియా నుంచి తూర్పు ఆసియాకు కూడా చేరాయి. రీసెంట్ గా ఇరాన్, పాకిస్థాన్ దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో 10 మందికిపైగా మృతి చెందారు. అమెరికా, ఇరాన్ మధ్య ఎప్పుడూ వివాదాలు ఉంటూనే ఉంటాయి. ఇజ్రాయిల్ యుద్దంలో అమెరికా ఇజ్రాయిల్కు, ఇరాన్.. హమాస్కు సాయం చేస్తోంది. కానీ.. అమెరికా, ఇరాన్ ప్రత్యక్ష దాడులకు దిగలేదు. కానీ ఇరాన్, అమెరికా ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో పశ్చిమాసియాలో వాతావరణం భయంకరంగా మారింది.