Challa Rajendra Prasad : టీ ఇష్టంగా తాగే మనదేశంలో ఓ యువకుడు కాఫీ వ్యాపారం మొదలు పెట్టాడు. 1985లో ‘కాంటినెంటల్ కాఫీ’ పేరుతో మొదలైన అతని వ్యాపార ప్రస్థానం నేడు ఖండాంతరాలకు వ్యాపించింది. కాఫీ ఘుమఘుమలను ఖండాలు దాటించి దేశీయ కాఫీ పరిశ్రమకు అంతర్జాతీయ ప్రఖ్యాతి తెచ్చిపెట్టి ప్రపంచం దృష్టిలో పడ్డాడు. ఆయనే చల్లా రాజేంద్ర ప్రసాద్.
విజయ ప్రస్థానం
అనంతపురంలోని ఓ గ్రామం నుంచి వచ్చిన రాజేంద్రప్రసాద్.. తెలుగు నేల మీద కాఫీ ప్లాంటు పెట్టాలనే ప్రయత్నం చేశారు. ఇన్స్టెంట్ కాఫీ తయారీతో స్థానికులకు పని, సర్కారుకు ఆదాయం, కాఫీ పరిశ్రమకు గుర్తింపు, ఎగుమతులు.. నాటి ఆయన లక్ష్యాలు. లైసెన్స్ రాజ్ రోజుల్లో ఢిల్లీలోని వాణిజ్య మంత్రిత్వశాఖను కలిస్తే.. వారు ‘కాఫీ బోర్డుతో మాట్లాడిరండి’ అంటూ చేతులు దులుపుకున్నారు. అప్పట్లో కాఫీ బోర్డు.. ఇన్స్టంట్ కాఫీ విభాగంలో బహుళజాతి కంపెనీలనే ఎక్కువగా ప్రోత్సహించేది.
దీంతో.. ప్రపంచపు నలుమూలల్లోని కాఫీ ఉత్పత్తుల అధ్యయనం కోసం విదేశీ పర్యటన చేసి తిరిగొచ్చారు.
1989లో Asian Coffee Ltd పేరుతో మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో ఇన్స్టెంట్ కాఫీ ప్లాంట్ పెట్టి తొలి ఎగుమతిదారుగా నిలిచారు. అది.. కామన్వెల్త్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సాయాన్ని పొందిన తొలి భారతీయ కంపెనీగానూ గుర్తింపు పొందింది. అయితే అందులోని భాగస్వాముల వాటాలను టాటా బెవరేజెస్ కొనుగోలు చెయ్యడంతో Asian Coffee Ltd తో ఆయన అనుబంధం ముగిసింది.
ఆ వెంటనే.. ఏపీలోని దుగ్గిరాలలో ఆధునిక సదుపాయాలతో Continental Coffee (India) Ltd పేరుతో కొత్త ప్లాంట్ పెట్టి, మంచి గుర్తింపు సాధించారు. ఈ విజయం స్ఫూర్తితో స్విట్జర్లాండ్, వియత్నాంలో ప్లాంట్లు నెలకొల్పారు. 2019 లో ఆంధ్ర ప్రదేశ్లో SEZ ప్లాంట్ స్థాపించడంతో కీర్తి పతాక స్థాయికి చేరింది.
మైలురాళ్లు
గడిచిన పాతికేళ్లలో మనదేశంలో 2 ప్లాంట్లు, స్విట్జర్లాండ్, వియత్నాం ప్లాంట్లతో కలిపి ఏటా 50 వేల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తులు అందించిన ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ లేబుల్ కాఫీ తయారీ సంస్థగా నిలిచింది. CCL కాఫీ ఉత్పత్తులు.. 90 దేశాలకు చేరటమే గాక ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 1000 కప్పుల కాంటినెంటల్ కాఫీ అమ్ముడవుతోంది.
భారత్ నుంచి అత్యధిక ఇన్స్టంట్ కాఫీని ఎగుమతి చేసే సంస్థగా నిలిచింది. కాఫీ రంగంలో రాజేంద్ర ప్రసాద్ పనితీరుకు మెచ్చి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పలుమార్లు ఆయనను కాఫీ బోర్డు సభ్యునిగా నియమించింది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ సాల్యుబుల్ కాఫీని నిలబెట్టిన ఈయనకు 2019 లో జర్మనీలో జరిగిన వరల్డ్ ఇన్స్టంట్ కాఫీ డిన్నర్మీట్లో చల్లా రాజేంద్ర ప్రసాద్ను ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు’తో గౌరవించారు.