YSRCP in Chittoor(AP political news): వైసీపీలో మార్పులు చేర్పుల ప్రహసనం కొనసాగుతూనే ఉంది. అలా వైసీపీ ప్రకటిస్తున్న కొత్త ఇన్చార్జులకు టికెట్ గ్యారెంటీ లేదని మరోసారి స్పష్టమైంది .. సత్యవేడు ఎమ్మెల్యే సీటు విషయంలో వైసీపీ అధిష్టానం మరోసారి అభ్యర్థిని మార్చింది. నాలుగో జాబితాలో సత్యవేడు అభ్యర్థిగా తిరుపతి ఎంపీ గురుమూర్తిని ప్రకటించిన జగన్.. కోనేటి ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీనికి ససేమిరా అన్న ఆదిమూలం పార్టీ మారైనా సత్యవేడు నుంచే పోటీ అంటుండటంతో.. ఇన్చార్జ్గా ప్రకటించిన గురుమూర్తిని తప్పించిన వైసీపీ.. మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిని మూడో కృష్ణుడిగా తెర మీదకు తెచ్చింది. అసలు సత్యవేడులో ఇన్ని మార్పులు జరగడానికి కారణాలేంటి? అక్కడ ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?
చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం అభ్యర్థుల విషయంలో వైసీపీ అధినాయకత్వం మరో ప్రయోగానికి సిద్దమైంది. నాలుగో జాబితాలో అభ్యర్థిగా తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తిని.. సత్యవేడు MLA అభ్యర్థిగా ప్రకటించారు. సిట్టింగ్గా ఉన్న కోనేటి ఆదిమూలాన్ని తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. కొన్ని రోజులు సైలెంట్గా ఉన్న ఆదిమూలం.. రివర్స్ అయ్యారు. ఏకంగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆయన పెత్తనం వల్లే నియోజకవర్గ అభివృద్ది కుంటుపడిదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. సత్యవేడు నియోజకవర్గంలో మొత్తం అక్రమ వ్యవహారాలన్నీ.. పెద్దిరెడ్డి అనుచరులే చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. దీంతో వైసీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. అనంతరం ఆదిమూలం.. టీడీపీ నేత నారా లోకేశ్తో భేటీ అయ్యారు. దీంతో.. ఆయన సైకిలెక్కుతారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇదే సమయంలో సత్యవేడు అభ్యర్థిగా మరో కొత్త వ్యక్తిని రంగంలో దించింది వైసీపీ అధిష్టానం. ఐదో జాబితాలో ఆ స్థానం నుంచి నూకతోటి రాజేష్ పేరు ప్రకటించింది. రాజేష్.. మాజీ మంత్రి కుతుహలమ్మ సోదరి కూమారుడు. జీడీ నెల్లూరు కోసం ఆయన చాలాకాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు.పెద్దిరెడ్డి అనుచరుడిగానూ రాజేష్కు పేరుంది. ఊహించని విధంగా రాజేష్ పేరు సత్యవేడు ఇన్ఛార్జ్గా నియమిస్తూ ప్రకటన రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తం మీద పెద్దిరెడ్డి.. తన అనుచరుడిని సత్యవేడు బరిలో దింపారని జిల్లాలో వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే జీడీ నెల్లూరు సిట్టింగ్ MLA, డిప్యూటీ సీఎం నారాయణస్వామి అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనను చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా నిర్ణయిస్తూ నాలుగో జాబితాలో ప్రకటించారు. అధిష్టానం నిర్ణయంపై నారాయణస్వామి అసంతృప్తిగానే ఉన్నారని జిల్లాస్థాయి నేతలు చెప్పుకుంటున్నారు. ఏదో ఒక సమయంలో ఆయన కూడా బరస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను.. జీడీనెల్లూరు అభ్యర్థిగా నిర్ణయించారు. దీనిపై రెడ్డెప్ప కూడా హ్యాపీగా లేరనే వార్తలు గుప్పుమంటున్నాయి. తన కూమార్తెకు పూతలపట్టు అభ్యర్థిగా అవకాశం ఇవ్వమని ఆయన అడుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పూతలపట్టు అభ్యర్థిగా మాజీ MLA డాక్టర్ సునీల్ పేరు అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరోసారి మార్పులు జరుగుతాయని అందరూ అనుకుంటున్నారు. మొత్తం మీద చిత్తూరు జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు సీట్లు ఎంపికపై వైసీపీ నాయకత్వం చేస్తున్న ప్రయోగాలపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.