India vs Pakistan : T20 వరల్డ్కప్లో 4 విజయాలతో గ్రూప్-1లో టాప్ ప్లేస్ లో నిలిచి టీమిండియా సెమీస్ బెర్త్ సాధిస్తే… నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా అనూహ్య ఓటమితో… పాక్ రెండోస్థానంలో నిలిచి… సెమీస్ చేరుకుంది. ఇప్పుడు రెండు జట్లు సెమీస్ లో పటిష్టమైన ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో తలపడబోతున్నాయి. సెమీస్ లో రోహిత్ సేన బట్లర్ బ్యాచ్ కు షాకిచ్చి ఫైనల్ చేరాలని భారత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కప్ కచ్చితంగా భారతే సాధిస్తుందని… కొన్ని సెంటిమెంట్లను గుర్తు చేస్తున్నారు.
2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది… టీమిండియా. ఆ టోర్నీలో జరిగినట్లే T20 వరల్డ్ కప్ లోనూ గ్రూప్ దశలో సౌతాఫ్రికా చేతిలో ఇండియా ఓడిపోయింది. ఐర్లాండ్ చేతిలో ఇంగ్లండ్ కూడా మట్టికరిచింది. సెమీస్ రేస్ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా నిష్క్రమించాయి. భారత్, పాక్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. ఇదో సెంటిమెంట్ అయితే… కెప్టెన్ గా రోహిత్ శర్మ ప్రతి ఫార్మాట్ లోనూ టోర్నీ లేదా సిరీస్ గెలిచాడు. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు టీమిండియానే T20 వరల్డ్ కప్ గెలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక పాకిస్థాన్ అభిమానులు మరో సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చారు. 1992 వన్డే వరల్డ్కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించగా… ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ సెమీస్ చేరాయి. ఫైనల్లో ఇంగ్లండ్పై పాకిస్థాన్ గెలిచి జగజ్జేతగా నిలిచింది. T20 వరల్డ్కప్లోనూ దాదాపు ఇలాంటి సమీకరణాలే ఉండటంతో… టీమిండియా సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఓడుతుందని, పాక్.. ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి ప్రపంచకప్ గెలుస్తుందని పాక్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మొత్తమ్మీద రెండు దేశాల అభిమానుల సెంటిమెంట్ లెక్కలు ఎలా ఉన్నా… ఫైనల్ చేరే జట్లేవో తెలియాలంటే మరో రెండు రోజులు, వరల్డ్ కప్ గెలిచే జట్టేదో తేలాలంటే మరో ఐదు రోజులు వేచిచూడాల్సిందే.