Vijayawada West Constituency : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం టీడీపీలో గట్టి పోటీ కనిపిస్తోంది.. ఒకరికి ముగ్గురు టికెట్ రేసులో కనిపిస్తున్నారు.. మరోవైపు ఈ సారి టికెట్ తనదే అంటూ జనసేన అభ్యర్ధి… ఎన్నికల ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా ఆ సీటు తమకే దక్కాలని రెండు పార్టీల నేతలు కోరుకుంటున్నారు. దాంతో అసలక్కడ పోటీ చేయబోయేదెవరన్నది ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ ఆశావహుల్లో ఒకరు ఎన్నికల బరిలో దిగుతారా? సీట్ల సర్దుబాటులో బెజవాడ్ వెస్ట్ జనసేన అకౌంట్లోకి వెళ్తుందా?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల సమయంలో.. టికెట్ల టెన్షన్ కనిపిస్తుంటుంది. ఎలక్షన్ అనగానే ఆయా పార్టీల అభ్యర్థులు టిక్కెట్ తమదేనంటూ ఎవరికి వాళ్లు ప్రచారం చేసుకుంటుంటారు. వచ్చే ఎన్నికలకు అధికార పార్టీ వైసీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రతిపక్షం మాత్రం పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించలేదు. సీట్ల సర్దుబాటులో బెజవాడ వెస్ట్ తమకే దక్కాలని టీడీపీ, జనసేన నేతలు కోరుకుంటున్నారు.
టీడీపీ, జనసేనల్లోని టికెట్ ఆశావహులు.. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ.. అధిష్టానం తమకే టికెట్ కేటాయించిందని చెప్పుకుంటూ గందరగోళం సృష్టిస్తున్నారు. మరొకపక్క అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం టిక్కెట్ పక్కా అనిపించుకోవడం కోసం ఎత్తులకు పైఎత్తు లు వేస్తూ పావులు కదుపుతున్నారు.
టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్చార్జిగా ఉన్న బుద్ధ వెంకన్న మాజీ మంత్రి బేగ్ కుమారుడితో పాటు.. జనసేన నాయకుడు పోతిన మహేష్ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ ఆశిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మైనారిటీ ఓట్లను దృష్టిలో పెట్టుకొని టిక్కెట్ తనకే ఇవ్వాలని, లేదా గత ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన తన కుమార్తెకు ఇవ్వాలంటూ జలీల్ ఖాన్ అధిష్టానానికి అర్జీలు పెట్టుకుంటున్నారంట.. అయితే ఈ సారి తానే పోటీ చేస్తానని లేటెస్ట్గా.. జలీల్ ఖాన్ కన్ఫర్మ్ చేశారు. ఆ క్రమంలో టికెట్ తనకి ఇవ్వకపోతే తన అనుచరులు ఆత్మహత్య చేసుకుంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మరోవైపు టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉన్న బుద్దా వెంకన్న ఈ సారి ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. తనకు పశ్చిమ టిక్కెట్ అయినా ఇవ్వాలి లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. అధినేతకు ధరఖాస్తు సమర్పించే ముందు.. ఇంద్రకిలాద్రి అమ్మవారి పాదాల వద్ద దాన్ని ఉంచి పూజలు జరిపించారు. తనకు టికెట్ దక్కేలా అమ్మవారు ఆశీర్వదించారంటూ హడావుడి చేస్తున్నారు. గుడికి భారీ ర్యాలీగా వెళ్లిన బుద్దా వెంకన్న .. తన బలాన్ని ప్రదర్ధించే ప్రయత్నం చేసి కలకలం రేపారు. టికెట్ తనకే కేటాయించాలని చంద్రబాబుతో పాటు పవన్కళ్యాణ్ని కూడా కోరారాయన. మరోవైపు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావవహిస్తానంటున్న బుద్దా.. టికెట్ దక్కలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శిస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇస్తున్నారు.
అలాగే టీడీపీ మాజీ మంత్రిగా పనిచేసిన బేగ్ కుమారుడు ఎమ్మే బేగ్ కూడా పశ్చిమ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. మొన్నటి వరకు విజయవాడ ఎంపీ కేసినేని నాని ముఖ్య అనుచరుడిగా ఉన్న బేగ్ నాని పార్టీ మారడంతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. తన ప్రయాణం టీడీపీ తోనే అని ప్రకటించిన ఆయన.. కేశినేనికి దూరం జరిగి టీడీపీ టికెట్ ప్రయత్నాల్లో పడ్డారు.
ఇక జనసేన కి సంబంధించి 2019 అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పోతిన మహేష్.. తనకు అధిష్టానం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోమని చెప్పారని.. ఈ సీటు జనసేనకే దక్కుతుంది చాలా ధీమాగా చెప్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా పొత్తులో జనసేన కి సీటు కేటాయిస్తారని.. జనసేన నుంచి తాను పోటీలో ఉంటానని గడపగడప కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. మరి పశ్చిమ పంచాయతీ ఎలా సెట్ రైట్ అవుతుందో చూడాలి.