Yashasvi Jaiswal : విశాఖలో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమ్ ఇండియా పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తోంది. 6 వికెట్ల నష్టానికి 336 పరుగులతో తొలిరోజు ముగించింది. కాకపోతే ఒకే ఒక్కడు 7 వికెట్ల భాగస్వామ్యాన్ని నెలకొల్పి నాటౌట్ గా నిలిచాడు. సహచరులందరూ ఒకొక్కరు వెనుతిరుగుతున్నా, చలించకుండా, వెన్ను చూపకుండా ఒంటరి పోరాటం చేస్తున్న.. యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్. ప్రస్తుతం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 179 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
257 బాల్స్ ఆడి 17 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఒక అద్భుత ఇన్నింగ్స్ నడిపించాడు. తొలిటెస్ట్ లో ఇంగ్లాండ్ క్రికెటర్ ఒలిపోప్ ఆడిన తీరుని, టీమ్ ఇండియా నుంచి తను చేసి చూపించాడు. ఓపెనర్ గా వచ్చిన యశస్వి తన భాగస్వామ్యాలను చక్కగా నిర్మించిన తీరు ఒకసారి చూద్దాం…
కెప్టెన్ రోహిత్ శర్మ (14)తో కలిసి తొలివికెట్ కి 40 పరుగులు జతచేశాడు. తర్వాత రెండో వికెట్ కి శుభ్ మన్ గిల్ (34)తో కలిసి 49 పరుగులు చేశాడు. మూడో వికెట్ కి శ్రేయాస్ అయ్యర్ (27) తో కలిసి 90 పరుగులు చేశాడు. ఇదే తొలిరోజు హయ్యస్ట్ పార్టనర్ షిప్ అని చెప్పాలి.
తర్వాత నాలుగో వికెట్ కి రజత్ పటీదార్ (32)తో 70 పరుగులు చేశాడు. తర్వాత ఐదో వికెట్ కి అక్షర్ పటేల్ (27)తో కలిసి 52 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేశాడు. తర్వాత ఆరో వికెట్ కి వికెట్ కీపర్, ఆంధ్రా ప్లేయర్ కేఎస్ భరత్ (17) తో కలిసి 29 పరుగులు చేశాడు. చివరిగా అశ్విన్ (5 నాటౌట్) తో కలిసి 6 పరుగులు చేశాడు.
ఇలా ఓవరాల్ గా టీమ్ ఇండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఈ చైన్ లింక్ పొడవునా యశస్వి జైస్వాల్ తొలిరోజు ఆటలో జట్టు స్కోరుకి వెన్నుముకగా నిలిచాడు. రెండో రోజు మరి భారత అభిమానులు ఆశిస్తున్నట్టు డబుల్ సెంచరీ చేస్తాడా? జట్టు స్కోరుని 400 దాటిస్తాడా? అనేది వేచి చూడాల్సిందే.