Team India : T20 వరల్డ్ కప్ లో ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ కోసం భారత అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఏయే ఆటగాళ్లతో బరిలోకి దిగుతుందా? అని లెక్కలేసుకుంటున్నారు. కొందరైతే… భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ మాటల ప్రకారం… తుది జట్టు ఇలా ఉండొచ్చని ఊహిస్తున్నారు.
ఇంగ్లండ్తో సెమీ ఫైట్ కు భారత జట్టులో రెండు మార్పులు జరిగే అవకాశం ఉందంటున్నారు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ విఫలం కావడంతో… అతని స్థానంలో దినేశ్ కార్తీక్ తిరిగి జట్టులోకి రావొచ్చు. అలాగే… స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్న అక్షర్ పటేల్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ చహల్ను తుది జట్టులో చేరే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే అడిలైడ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని… అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశాన్ని పరిశీలిస్తామని ద్రవిడ్ వ్యాఖ్యానించడంతో… సెమీస్ లో చహల్కు అవకాశం దక్కడం ఖాయమంటున్నారు. ఇవి మినహా టీమిండియా మరే మార్పులు చేసే సాహసం చేయకపోవచ్చని చెబుతున్నారు. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ల్లో ఎవరో ఒకర్నే తీసుకోవాల్సి వస్తే… ముందు బ్యాటింగ్ చేయాల్సి వస్తే పంత్ను.. ఛేజింగ్ చేయాల్సివస్తే దినేష్ కార్తీక్ కు జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు.
మరోవైపు… టీమిండియాతో సెమీస్ కు ముందు ఇంగ్లండ్ కు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టులో కీలక ఆటగాడు, విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మలాన్… గాయం కారణంగా టీమిండియాతో మ్యాచ్కు దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో గాయపడిన మలాన్… ఆ మ్యాచ్లో బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు. దాంతో… టీమిండియాతో జరిగే సెమీస్ మ్యాచ్కు మలాన్ ఫిట్గా లేడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తేల్చింది. అతని స్థానంలో ఫిల్ సాల్ట్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.