CM Revanth Reddy Indravelli Sabha : ఆదిలాబాద్ లో పార్లమెంట్ ఎన్నికలకు సీఎం రేవంత్ రెడ్డి సమరశంఖం పూరించారు. ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన సభలో సీఎంతో పాటు, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, కొండా సురేఖ పాల్గొన్నారు.
“ఇంద్రవెల్లి మట్టికి గొప్పతనం, గాలిలో పౌరుషం ఉన్నది. కొమురం భీం, రాంజీ గోండ్ పోరాట స్పూర్తిని పునికిపుచ్చుకోవాలి. ఆదిలాబాద్ ను దత్తద తీసుకుంటాం. 1981 ఇంద్రవెల్లి మారణకాండలో బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. గత ప్రభుత్వం ఏనాడైనా ఆదివాసీ బిడ్డలను ఆదుకుందాం. తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. కడెం ప్రాజెక్టుకు కనీసం మరమత్తులు చేశారా. నాగోబా గుడిని ఏనాడైనా పట్టించుకున్నారా? ఆదివాసీ బిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్ లు అయ్యి దేశాన్ని ఏలాలి. మిషన్ భగీరథలో 40 వేల కోట్లు దోచుకున్నారు. 10 సంవత్సరాలుగా స్టాఫ్ నర్సు పోస్టులనే భర్తీ చేశారా? బిల్లా రంగాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. కవిత ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీని చేసినప్పుడు అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో విద్యార్థులు గుర్తురాలేదా?
త్వరలోనే లక్ష మంది మహిళలకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఇది ప్రజలకోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం. గద్దర్ ఉసురుతగిలి పోయారు. మా ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవ్వరికీ లేదు. కేసీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి కాదు కదా.. మంత్రి కూడా కాలేడు. దేశంలో ఉన్నవి రెండే కూటములు.. ఒకటి ఎన్డీయే, రెండు ఇండియా కూటమి. కేసీఆర్ ఢిల్లీలో మోదీకి గులాంగిరి చేస్తాడు. మతం పేరు మీద ఒకరు, మద్యం పేరు మీద ఒకరు వచ్చి ఓట్లు అడుగుతారు. మోదీ, కేడీ ఇద్దరు ఒకటే. రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఇందిరమ్మ మనవడిని దేశ ప్రధానిని చేయాలంటే ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి” అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.