Poonam Pandey: బాలీవుడ్ వివాదాస్పద నటి పూనమ్ పాండే (32) తాజాగా గర్భాశయ క్యాన్సర్తో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె టీమ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ వార్త తెలిసి బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్కి గురైంది. ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. రచ్చ రచ్చ చేసే పూనమ్ ఇక లేరని తెలిసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఇంతకీ పూనమ్ పాండే ఎవరు?. ఆమె ఎందుకు వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకుంది. అనే విషయానికొస్తే..
పూనమ్ పాండే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జన్మించింది. విద్యాబ్యాసం తర్వాత మోడలింగ్ కెరీర్ చేయసాగింది. 2010లో గ్లాడ్రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో మొదటి 8 మందిలో నిలిచింది.
దీంతో ఆత్మస్థైర్యం తోడవడంతో మోడలింగ్లో రాణించింది. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీలో తళుక్కున దర్శనమిచ్చింది. అయితే ఈ భామ మైండ్లో ఏ ఆలోచన మెదిలిందో ఏమో కానీ.. ఒక్క ప్రకటనతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది.
2011 వరల్డ్ కప్లో సంచలన ప్రకటన చేసింది. వరల్డ్ కప్లో టీమిండియా గెలిస్తే గ్రౌండ్ మొత్తం ఒంటి మీద దుస్తుల్లేకుండా తిరుగుతానని ప్రకటించింది. ఆ ప్రకటనతో ఆమె పేరు మారుమోగిపోయింది. అయితే భారత్ వరల్డ్ కప్ సాధించినా.. పూనమ్ బట్టల్లేకుండా తిరిగేందుకు బీసీసీఐ అనుమతించలేదు.
అయినప్పటికీ ఆమె తన మాట నిలబెట్టుకోవడం కోసం..కొన్ని వారాల తర్వాత వాంఖడే స్టేడియంలో బట్టల్లేకుండా తిరిగిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే అక్కడితో ఆగకుండా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సొంతంగా ఓ యాప్ తయారుచేయించుకుంది. ఆ యాప్లో బోల్డ్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కోట్లలో వ్యూస్ రాబట్టింది. అయితే ఆ యాప్ను గూగుల్ బ్యాన్ చేసింది.
ఇక రియల్ లైఫ్లో బోల్డ్గా ఉండే పూనమ్ పలు సినిమాలలో కూడా నటించింది. అయితే ఆ సినిమాల్లో కూడా బోల్డ్ పాత్రలే చేసింది. ‘నషా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఓ విద్యార్థితో సంబంధం పెట్టుకునే ఓ టీచర్లా కనిపించింది. అందుకు సంబంధించిన పోస్టర్ సృతిమించడంతో ఆ మధ్య పెద్ద రచ్చే అయింది.
ఆ తర్వాత ముంబై మిర్రర్ వంటి అరడజనుకు పైగా సినిమాలలో నటించింది. తెలుగులో కూడా మాలిని అండ్ కో అనే మూవీ చేసింది. అంతేకాకుండా కొన్ని రియాలిటీ షోల్లో కూడా పార్టిసిపేట్ చేసి తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకుంది.
అంతేకాకుండా అప్పట్లో ఆమె ప్రేమ వ్యవహారం కూడా ఎన్నో వివాదాలతో నడించింది. 2020లో సామ్ బాంబేను పెళ్లాడింది. ఇక నెల తిరగక ముందే అంటే 15 రోజుల్లోనే తన భర్త సామ్ బాంబే వేధిస్తున్నాడంటూ అతనిపై గృహహింస కేసు పెట్టింది. అయితే ఆ సమయంలో ఈ వార్త పెను సంచలనమే సృష్టించింది. ఆ తర్వాత మళ్లీ సామ్ బాంబేతో సంసారం కొనసాగించింది.
అలా కొన్ని రోజుల తర్వాత భర్యా భర్తలిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక అదే ఏడాదిలో పోలీసులు ఈమెను అరెస్టు చేశారు. గోవాలోని ప్రభుత్వ స్థలంలో అశ్లీల వీడియో చిత్రీకరించినందుకుగానూ పూనమ్ను జైల్లో పెట్టారు. ఇలా ఆమె జీవితం మొత్తం వివాదాలతోనే కొనసాగింది. చివరికి అందరూ ఉన్నా.. ఎవరూ లేని అనాథలా తనువు చాలించింది.