CM Revanth Reddy Indravelli Tour Updates : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.. నాగోబా ఆలయం ఆవరణలో దాదాపు 49 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయనకు మెస్రం వంశీయులు అమ్మవారికి జ్ఞాపికను బహూకరించారు. తెలంగాణ సీఎంకు ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్వాగతం పలికారు. 5 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆలయ గోపురాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం కేస్లాపూర్లో ఏర్పాటు చేసిన మహిళ దర్బార్లో పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భట్టి విక్రమార్క పాదయాత్ర ఆదిలాబాద్ లోనే ప్రారంభమయ్యిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలిచ్చిందని గుర్తుచేశారు. ఇందిరమ్మ పాలనలో మహిళల సంక్షేమమే లక్ష్యమని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలకు ఎందుకు కడుపునొప్పి అని ప్రశ్నించారు. స్కూల్ యూనిఫామ్లు కుట్టే అవకాశాన్ని మహిళా సంఘాలకే అప్పగిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే మిగతా గ్యారంటీలను అమలుచేస్తామని తెలిపారు. బ్యాంక్ లింకేజీ కింద 12 వేల మందికి లబ్ధి చేకూరేలా రూ. 60 కోట్ల చెక్ను మహిళా సంఘాలకు విడుదల చేశారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూపులకు రూ. 25 లక్షల చొప్పున విడుదల చేశారు.
ఆ తర్వాత.. రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తారు. అక్కడ ఏర్పాటు చేయనున్న స్మృతివనానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు.
ఇక ఫిబ్రవరి 9 నాగోబా జాతర జరగనుంది. నాగోబా జాతర సమయంలో ఏర్పాటయ్యే దర్బార్కు ప్రత్యేకత చరిత్ర ఉంది. 63 ఏడేళ్ల క్రితం గ్రామాలకు ఎలాంటి సదుపాయాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరుగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. భూమి కోసం.. విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రొఫెసర్ హైమన్డార్ఫ్ ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు.ఆయన గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అలా ప్రొఫెసర్ హైమన్డార్ఫ్ 1946లో మొదట దర్బార్ నిర్వహించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు.
జాతర ఆఖరి రోజు జరిగే దర్బార్ లో గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. పూజల తర్వాత నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్లు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఆ మట్టితో పుట్టను అలికి మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్లు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయడం సంప్రదాయం. ఈ జాతరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రా నుంచి భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.