Rishabh Pant’s Harrowing Experience : ఇండియన్ స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాడు. ఏదొక అంశంపై మాట్లాడుతూ మళ్లీ జనజీవన స్రవంతిలో కలవాలని ట్రై చేస్తున్నాడు. నేనున్నాను అంటూ గుర్తు చేస్తున్నాడు. ఇటీవల తను ఒక పోస్ట్ పెట్టి, అసలు బతుకుతానని అనుకోలేదని అన్నాడు.
ఇప్పుడు తాజాగా మరొక పోస్ట్ పెట్టి, నా కాలు పోయిందేమో, ఇక లేదేమోనని, చాలా భయపడ్డానని అన్నాడు. కారు ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరిన తర్వాత, నా ధ్యాసంతా కాలుపైనే ఉందని అన్నాడు. కాలు కదుపుతుంటే, నా బ్రెయిన్ కి సరైన సిగ్నల్స్ అందడం లేదు. బహుశా నరాలు నలిగిపోయాయేమో, నా కాలు ఇక పోయినట్టే? అని చాలా ఆందోళన చెందాను.
కారు ప్రమాదం జరిగినప్పుడు చాలామంది వచ్చి సాయం చేశారు. అప్పుడే నాకు బాగా డౌటు వచ్చింది. అక్కడున్న ఒకతన్ని చూసి, నా కొలు కొద్దిగా సరిచేయమని అడిగానని అన్నాడు. వాళ్లు కదిపిన తర్వాత ఓకే, ఫర్వాలేదు, కొద్దిగా కదలిక ఉందని అనుకున్నాను.ఆ దేవుడికి శతకోటి దండాలు పెట్టుకున్నాను.
ఆ తర్వాత నన్ను నా కారులోంచి బయటకు లాగి, వేరే కారులోకి మార్చారు. అదొక్కటే జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత నాకేమీ గుర్తు లేదని అన్నాడు. కానీ ఆసుపత్రిలో మాత్రం కాలు తీసేస్తారేమోననే భయం నన్ను చాలాకాలం వెంటాడింది.
ఆసుపత్రిలో ఉన్నంతకాలం నా కాలువైపు ఎప్పుడూ చూసుకుంటూనే గడిపానని అన్నాడు. ఆరోజు జరిగిన సంఘటన ఎలా ఉన్నా, కాలు భయం మాత్రం నన్ను వెంటాడుతూనే ఉండేదని అన్నాడు.
ఏడాది క్రితం పంత్ ప్రయాణిస్తున్న ఎస్ యూవీ కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న రజత్ కుమార్, నిషు కుమార్ ఇద్దరూ తనని కాపాడి, ఆసుపత్రిలో చేర్చారు.
కాసేపటికే పంత్ కారు మంటల్లో ఆహుతైపోయింది. నిజానికి వారు అక్కడ లేకపోయినా, సరైన సమయంలో స్పందించకపోయినా పంత్ కి చాలా పెద్ద ప్రమాదమే సంభవించేది. వారలా కాపాడటంతో ఒక్కసారి వారు కూాడా సెలబ్రిటీలు అయిపోయారు. అందరూ వారిని అభినందనలతో ముంచెత్తారు.