Significance of Prasada : భగవంతుడికి సమర్పించే నైవేద్యాలను భగవంతుడు తినడు. కానీ పూజించేవారికి భగవంతుడిపై ఉన్న కృతజ్ఞతాభావాన్ని సూచిస్తుంది నైవేద్యం. లోకంలో మనిషి బతకడానికి భుజించే ఆహారపదార్థాలన్నీ ప్రకృతి ప్రసాదించినవే. ప్రకృతిని సృష్టించి చల్లగా కాపాడుతున్నందుకు ఆ దేవుడికి ఈ జీవుడు కృతజ్ఞతాపూర్వకంగా అర్పించేదే నైవేద్యం. తాను అనుభవించడంకన్నా ఇతరులకు పంచడంలోనే ఆనందం ఉందని చెప్పడమే ఈ ఆచారం వెనుక ఉద్దేశం..
సాధారణంగా దేవాలయాలకు వెళ్లి, ఆ దేవ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, తీర్థ ప్రసాదాలను పుచ్చుకోవడం ఆనాదిగా వస్తున్న ఆచారం.దేవాలయాలను సందర్శించి నప్పుడు మాత్రమే నైవేద్యాలు సమర్పించుకుండా మన ఇంట్లో చేసే పూజా కార్యక్రమాలలో కూడా దేవ దేవతలకు నైవేద్యాన్ని సమర్పిస్తారు. నిత్య పూజ అయినా లేదా ప్రత్యేక పర్వదినాలలో అయినా పూజలు నిర్వహించి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు.
పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, ఎటువంటి లోటు ఉండకూడదన్న ఉద్దేశంతో నైవేద్యాన్ని దేవునికి పెడతారు. సాధారణంగా ఆలయానికి వెళ్లినా, ఇంట్లో పూజ చేసినా కొబ్బరికాయ, అరటి పండ్లు ప్రసాదంగా పెడతాము. కానీ ఒక్కో దేవుడికి ప్రీతిపాత్రమైన నైవేద్యం ఒక్కోటి ఉంటుంది. విఘ్నేశ్వరుడికి బెల్లం అంటే ప్రీతి. ఉండ్రాళ్లు, జిల్లేడుకాయలు నైవేద్యంగా సమర్పించాలి. గణపయ్యకి గరిక మాల అంటే చాలా ఇష్టం. శివుడికి కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యం పెట్టి మారేడు దళాలు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి. వేంకటేశ్వరుడికి తులసిమాల మెడలో వేసి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి.సత్యనారాయణస్వామికి ఎర్ర గోధుమనూక, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి, పంచదార కలిపిన ప్రసాదం నైవేద్యం పెట్టాలి. హనుమంతుడికి అప్పాలంటే ఎంతో ఇష్టం. అప్పాలు నైవేద్యంగా సమర్పించి సింధూరం, తమలపాకులతో పూజించాలి.లలితాదేవికి క్షీరాన్నం, పండ్లు, పులిహోర, పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యంగా పెట్టాలి. దుర్గాదేవికి మినపగారెలు నైవేద్యం పెట్టి నిమ్మకాయల మాల అమ్మవారికి వేస్తే చాలా మంచిది.