Poonam Pandey death news(Bollywood celebrity news): ప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండే (32) మృతి చెందిందంటూ.. వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత సిబ్బంది ఈ మేరకు చేసిన పోస్టులు వైరల్ గా మారాయి. పూనమ్ పాండే అఫీషియల్ ఇన్ స్టా ఖాతాలో శుక్రవారం.. ఆమె మృతి చెందినట్లు పోస్ట్ చేశారు. గర్భాశయ క్యాన్సర్ (Servical Cancer) కారణంగా ఆమె మరణించినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. గురువారం (ఫిబ్రవరి 1) రాత్రే ఆమె మరణించినట్లు సన్నిహితులు మీడియాకు తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. 2013లో నషా అనే సినిమా ద్వారా బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించింది. సినిమాల్లో కంటే.. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసే వివాదాస్పద వ్యాఖ్యల ద్వారానే ఆమె గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియా సెన్సేషన్, ఇన్ఫ్లుయెన్సర్, శృంగార తార, తన అందచందాలతో యువతకు మత్తెక్కించే పూనమ్ పాండే హఠాన్మరణ వార్త.. బాలీవుడ్ ను షాక్ కు గురిచేసింది. ఆమె ఇన్ స్టా ఖాతాలో మరణవార్త పోస్ట్ చేసిన కొద్దిసేపటికే.. పలువురు బాలీవుడ్ నటులు ఇది నమ్మలేకపోతున్నామని పేర్కొన్నారు. కొంతకాలం క్రితమే ఆమె సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన పూనమ్ పాండే.. అనతికాలంలోనే మిలియన్ కు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. ప్రముఖ నటి కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరించిన లాకప్ తొలి సీజన్లో పూనమ్ పాల్గొంది. అలాగే.. 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీ సందర్భంగా చేసిన ప్రకటనతో పూనమ్ చాలా పాపులర్ అయింది. సినీ కెరీర్ లో రాణిస్తున్నా.. వైవాహిక జీవితం మాత్రం ఆనందంగా లేదు. ఆమె భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది. ఆపై ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఆమె మాల్దీవుల షూటింగ్ ను రద్దు చేసుకోవడంతో.. వార్తల్లోకెక్కింది.
దేశవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్.. సర్వైకల్ క్యాన్సర్ నుంచి బాలికలకు రక్షణ కల్పించేందుకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసి 24 గంటలైనా గడవకుండానే.. పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మృతి చెందడం గమనార్హం.