Interim Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామణ్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ లో క్రీడలకు అరకొరా కేటాయింపులే దక్కాయి. గత ఏడాదితో పోల్చుకుంటే, ఈసారి కేవలం రూ.45.36 కోట్లు మాత్రమే ఎక్కువ ఇచ్చారు. గత ఏడాది బడ్జెట్ లో రూ.3,396.96 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది దానిని 3,442.32 కోట్లకు పెంచారు.
భారతదేశంలో పేద, మధ్యతరగతి క్రీడాకారులు ఉన్నత స్థాయిలో ఆడేందుకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన భారతదేశంలో శూన్యమనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎంతో మంది ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడానికి, భారతదేశంలో ఈ నిధులు ఏమూలకు సరిపోవని అంటున్నారు.
ఇకపోతే ఈ ఏడాది జూన్ 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పారిస్ ఒలింపిక్స్ కు క్రీడల బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించారు. అలాగే ‘ఖేలో ఇండియా’కు రూ.900 కోట్లు కేటాయించారు. శిక్షణ శిబిరాలు, మౌలిక వసతుల కల్పన, క్రీడా పరికరాల కొనుగోలుకు గత ఏడాదికంటే రూ.26.83 కోట్లు ఎక్కువ పెంచారు. మొత్తానికి క్రీడా ప్రాధికార సంస్థకు రూ.795.77 కోట్లు కేటాయించారు. ఇక జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ.325 కోట్లు, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) కు రూ.22.30 కోట్లు కేటాయించారు.
అయితే ఇవన్నీ బడ్జెట్ పద్దుల్లో కనిపిస్తున్నా, ఏడాది పొడవునా విదిలిస్తూ వెళుతున్నారని అంటున్నారు. అక్కడ చూపించేవి ఒకటి, ఏడాది చివరికి వచ్చేసరికి ఏమీ ఉండదని అంటున్నారు. అంతా మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని, ఈ పద్దులన్నీ జనాన్ని మభ్యపెట్టడానికేనని అంటున్నారు. అసలు బడ్జెట్ పెట్టిన తర్వాత, చివర్లో వేటికెంత ఖర్చు చేశారో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందని మాజీ క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు.
భారతదేశంలో క్రీడాకారులకు ప్రభుత్వ సహాయం దొరికితే ఒలింపిక్స్ లో 140 కోట్లున్న ప్రజలు అద్భుతాలు సృష్టిస్తారని అంటున్నారు. ఏమీ లేకపోతే రెజ్లింగ్ సమాఖ్యల్లో గొడవలు ఎందుకు జరుగుతాయని, అందరూ సాధించిన మెడల్స్ తీసుకువెళ్లి ఎందుకు వెనక్కి ఇచ్చేస్తారని అంటున్నారు. ఒక్క క్రికెట్ మాత్రమే కాదు, అన్ని ఆటలకు సమ ప్రాధాన్యత కల్పించాలని మాజీ క్రీడాకారులు వ్యాఖ్యానిస్తున్నారు.